(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలంగాణలో హుజూర్ నగర్ ఉపఎన్నిక తర్వాత కొత్త పీసీసీ చీఫ్ కాబోతున్నారా ? ఇందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి సంకేతాలు వచ్చాయా ? తాజాగా జరిగే పరిణామాలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. హుజూర్ నగర్ ఉపఎన్నికనే టీ.పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ సారధ్యంలో జరిగే చివరి ఎన్నిక అని ప్రచారం సాగుతోంది. ఈ ఎన్నికలో సత్తా చాటితేనే ఆయన్ని పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిస్తారనీ లేదంటే పదవి నుంచీ తొలగిస్తారని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వాదనను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. హుజూర్నగర్ ఉప ఎన్నికకూ, తన పదవికీ సంబంధం లేదన్నారు. తన పదవీ కాలం ఆల్రెడీ పూర్తి కావస్తోందనీ, అందువల్ల సహజంగానే తనను తప్పించి వేరేవారికి అవకాశం ఇస్తారని చెప్పారు. ఉపఎన్నికలో కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుందని చెప్పిన ఉత్తమ్.. కాంగ్రెస్ ఓడిపోతే మాత్రం మొత్తం బాధ్యత తనదే అని పేర్కొన్నారు.
మరోవైపు కొత్త పీసీసీ చీఫ్ గా ఎవరినీ ఎంపిక చేస్తారన్నది సస్పెన్స్ గా మారింది. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి తదితరులు పేర్లు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే రేవంత్ రెడ్డి తన కుటుంబంతో ఢిల్లీ వెళ్లి.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. పీసీసీ చీఫ్గా రేవంత్ పేరు ఖరారయ్యిందని వార్తలు వచ్చినప్పటికీ… అంతర్గతంగా ఆ పార్టీలో చాలా మంది అధ్యక్ష పీఠంపై కన్నేశారు. కోమటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ తదితరులు తాము పోటీలో ఉన్నామని బహిరంగంగా అన్నారు. నిజానికి పీసీసీ అధ్యక్ష పదవి కోసం రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పోటీపడ్డారు. కానీ రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్లు చెప్పడంతో ఇక రేవంత్రెడ్డికి లైన్ క్లియర్ అయినట్లేనని భావించారు. ఎప్పుడు మార్పు జరిగినా నెక్ట్స్ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి అనే ప్రచారం రాజకీయవర్గాల్లో జోరుగా జరిగింది. ఇదే సమయంలో పార్టీలో రేవంత్రెడ్డికి అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయిందట. రేవంత్ పేరు ప్రముఖంగా ప్రచారంలో ఉండటంతో పార్టీలోని కొందరు సీనియర్లు ఒక్కటైనట్లుగా తెలుస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా ఢిల్లీస్థాయిలో వారు చక్రం తిప్పినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కొత్తగా పార్టీలో చేరినవారికి పదవులు ఇవ్వడం వల్ల టీ-కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోతుందని పార్టీ పెద్దలను హెచ్చరించారట. మొదటినుంచి కాంగ్రెస్లో ఉంటూ.. పార్టీకోసం పనిచేసిన నాయకులకే పదవులు ఇవ్వాలని వారు విజ్ఞప్తిచేశారట.
ఇక టీ-పీసీసీ అధ్యక్షుని మార్పు జరిగితే పార్టీలో మొదటినుంచి ఉన్న నాయకుల్లో ఎవరికి ఇచ్చినా పర్వాలేదు అధిష్టానం పెద్దలకు చెప్పినట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి వచ్చిన రేవంత్కు అధ్యక్ష బాధ్యతలు ఇస్తే మాత్రం తాము పార్టీలో పనిచేయలేమనే సంకేతాలు ఇచ్చారట. ప్రస్తుత పీసీసీ చీఫ్ రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు కాబట్టి.. మళ్లీ అదే సామాజికవర్గం నేతకు అవకాశమిచ్చే పక్షంలో నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేరు వినిపిస్తోంది. టీ-పీసీసీ చీఫ్ పదవికి రేసులో ప్రస్తుతం మాజీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఇది ఇలా ఉంటే ఈ అంశంపై పార్టీకి చెందిన సీనియర్ నాయకులతో కూడా అధిష్టానం సమాలోచనలు జరిపింది. టీ.పీసీసీ చీఫ్ మార్పు తథ్యమని సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనికి హుజూర్ నగర్ ఉప ఎన్నికల తర్వాతే ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. మరి టీ-పీసీసీ చీఫ్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఉత్కంఠగా మారింది. భవిష్యత్తు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే సత్తా ఉన్న నేతకే టీపీసీసీ చీఫ్ పదవిని కేటాయిస్తారని పార్టీ వర్గాల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. మరి ఈ విషయంలో స్పష్టత రావాలంటే..హుజూర్ నగర్ ఫలితాల వరకూ ఆగాల్సిందే.