(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
భారీ నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వరంగ సంస్థలు ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం సంస్థలను వచ్చే ఏడాది మార్చి లోపు విక్రయిస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. ఇప్పటివరకు ఈ రెండు కంపెనీలలో కేంద్రం పెట్టుబడులను పెట్టగా.. ఇప్పుడు వాటిని ఉపసంహరించుకుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక లక్ష కోట్ల రాబడులను సమీకరించాలన్న లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమవుతుందని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు. చాలామంది పెట్టుబడిదారులు ఈ రెండు కంపెనీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. రెండు కంపెనీల విక్రయం ఈ ఆర్థిక సంవత్సరమే పూర్తి చేయాలని భావిస్తున్నామని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అనుసరించి తుది నిర్ణయం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ వాటాల ఉపసంహరణ తరువాత సంస్థ నిలదొక్కుకుంటుందన్న భరోసాను వ్యక్తం చేశారు.
Air India, Bharat Petroleum Corporation to be sold by March: FM Nirmala Sitharaman – Times of India https://t.co/8FbWsiSdSH
— Nirmala Sitharaman (@nsitharaman) November 17, 2019
ఎయిర్ ఇండియా సంస్థ దాదాపు రూ.58,000 కోట్ల అప్పుల్లో ఉండగా ఆర్ధికమంత్రి నుంచి ఇటువంటి ప్రకటన రావడం గమనార్హం. ఇదిలా ఉండగా ఎయిర్ ఇండియా చైర్మన్ అశ్వనీ లోహాని.. పెట్టుబడులు ఉపసంహరణ సంస్థ స్థిరత్వానికి దోహదపడుతుందంటూ గతంలోనే ఉద్యోగులందరికీ బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇటీవల పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి కేంద్ర కేబినెట్ లో పలు సంస్కరణలను ఆమోదించారు. విమానాలకు ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ను సమకూర్చే చమురు కంపెనీలకు ఎయిర్ ఇండియా రూ 4,500 కోట్ల మేర చెల్లింపులు బకాయి ఉండటంతో ఆయా సంస్థలు ఇంధన సరఫరాను నిలిపివేశాయి. నిధుల సమీకరణ సంక్లిష్టంగా మారడంతో చెల్లింపులు, రుణాల విషయంలో ఎయిర్ ఇండియా ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
మరోవైపు భారత పెట్రోలియం మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 1.02 లక్షల కోట్లు ఉండగా, ప్రభుత్వం 65,000 కోట్లు విక్రయానికి పెట్టనున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశాన్ని ఆర్ధిక సంక్షోభం పట్టి పీడిస్తుండగా.. వివిధ రంగాల్లో మాంద్యం ఏర్పడిందని… దాన్ని అధిగమనించడానికి కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందంటూ నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.