(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి షెడ్యూల్ తెగలకు చెందిన వ్యక్తి కాదని చత్తీస్గఢ్ ప్రభుత్వం నియమించిన ఒక ఉన్నత స్థాయి కమిటీ తేల్చింది. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి చత్తీస్గఢ్ జనతా కాంగ్రస్ పార్టీ స్థాపించిన అజిత్ జోగి ప్రస్తుతం మార్వాహి స్థానం నుంచి శాససనభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
జోగి ఎస్టి కిందకు రారు కాబట్టి ఆయన ఎస్టి సర్టిఫికెట్లు రద్దు చేయాలనీ, ఆ హోదా కింద సమకూరిన అన్ని సదుపాయాలూ ఉపసంహరించాలనీ కమిటీ సిఫారసు చేసింది. హైకోర్టు ఆదేశానుసారం ఈ కమిటీని నియమించారు. మార్వాహి స్థానం ఎస్టిలకు రిజర్వు అయిన సీటు కాబట్టి కమిటీ నివేదిక ప్రకారం ఆయన అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది.
చత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పాటయిన నాటినుంచీ జోగి ఎస్టి హోదాపై వివాదం రగులుతూనే ఉంది. జోగి ఎస్టి కాదంటూ ఆయన రాజకీయ ప్రత్యర్ధులు కోర్టును ఆశ్రయించారు. ఫోర్జరీ చేసిన పత్రాల ఆధారంగా ఆయన ఎస్టి సీటు నుంచి పోటీ చేస్తున్నారని వారు ఆరోపించారు. ఇలా రెండు వేరువేరు పిటిషన్లు దాఖలైన మీదట హైకోర్టు ఒక కమిటీ నియమాకానికి ఆదేశించింది.
2017లో ఆ కమిటీ అజిత్ జోగి ఎస్టి హోదాను రద్దు చేసింది. అయితే జోగి దానిపై హైకోర్టును ఆశ్రయించారు. దానితో హైకోర్టు మరో కమిటీ నియామకానికి 2018 ఫిబ్రవరిలో ఆదేశించింది. ఇప్పుడా రెండవ కమిటీ జోగి ఎస్టి కారని తెల్చి చెప్పింది.