ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన పదవికి రాజీనామా చేశారు. రేపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో అజిత్ పవార్ రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రమాణస్వీకారం చేసిన మూడు రోజుల్లోనే తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
బలపరీక్షకు ముందు అజిత్ పవార్ రాజీనామా చేసే విషయంలో శరద్ పవార్ తెర వెనుక చక్రం తిప్పారు. తన కుటుంబ సభ్యుల ద్వారా ఆయనపై ఒత్తడి తీసుకువచ్చారు. శరద్ పవార్ భార్య, అల్లుడు అజిత్ పవార్ ను కలిసి.. రాజీనామాపై ఒప్పించినట్లు సమాచారం. పార్టీలోకి తిగిరి తీసుకొనేందుకు వీలుగా ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ ను సస్పెండ్ చేయలేదనే ప్రచారం కూడా జరుగుతోంది.
శివసేన – ఎన్సీపీ – కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని, ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అవుతారని ప్రకటన వచ్చిన తర్వాత..శుక్రవారం(నవంబర్ 22) రాత్రికి రాత్రే ఎన్సీపీ నేత అజిత్ పవార్ బీజేపీకి జైకొట్టారు. దీంతో అజిత్ పవార్తో కలసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ఈనెల 23న ప్రమాణస్వీకారం చేశారు. ఆదే రోజు తెల్లవారుఝామున 5.43 గంటలకు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను ఎత్తివేశారు. ఆ వెంటనే మహారాష్ట్ర రాజ్ భవన్ లో ఫడ్నవీస్, అజిత్ పవార్ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ చర్యతో యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురి చేశారు అజిత్ పవార్. దీనిపై ఎన్సీపీ – కాంగ్రెస్ – శివసేన కలసి సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. బీజేపీకి మెజారిటీ లేదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి. దీనిని విచారించిన సుప్రీంకోర్టు.. ఈనెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఫడ్నవీస్ ప్రభుత్వం అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని ఆదేశించింది.
మరోవైపు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఎన్సీపీ సభాపక్ష నేతగా అజిత్ పవార్ ను తొలగించారు. ఇక సోమవారం జరిగిన కూటమి సమావేశంలో ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అధికారం అజిత్ పవార్ కు లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.