(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు ఎన్ డి ఎ కూటమిలో చిచ్చు రేపింది. ఎన్ డి ఎ లో ప్రధాన భాగస్వామిగా ఉన్న శిరోమణి అకాలీదళ్ వ్యవసాయ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించడం ఎన్ డి ఎ ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా మారింది. ఈ బిల్లు చిచ్చు నేపథ్యంలో అకాలీదళ్ నాయకురాలైన కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
వివరాల్లోకి వెళితే…కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో మూడు వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టింది. ఇందులో రైతులు తమ ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోనే విక్రయించాలన్న నిబంధనను తొలగిస్తూ తీసుకువచ్చిన ద ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు, పంట వేయడానికి ముందే వ్యవసాాయ ఉత్పత్తుల విక్రయంపై వ్యాపారులతో రైతులు చేసుకొనే ఒప్పందాలకు రక్షణ కల్పించే ద ఫార్మర్స్ (ఎంపవర్ మెంట్ ఆండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ అన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫామ్ సర్వీసెస్ బిల్లు, సహకార బ్యాంకులపై పర్యవేక్షణ అధికారాలను ఆర్ బి ఐ కి కట్టబెడుతూ తీసుకువచ్చిన ద బ్యాంకింగ్ రెగ్యులేషన్ (అమెండ్ మెంట్) బిల్లులు ఉన్నాయి. ఈ బిల్లులు చట్టరూపం దాలిస్తే వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వెళ్తుందని అకాలీదళ్ పేర్కొంటూ విభేదించింది. ఈ బిల్లుల్లో అనేక అంశాలు రైతాంగ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని అకాలీదళ్ అభిప్రాయపడుతున్నది.
అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ ఎమన్నారంటే…
ఈ బిల్లు వ్యవసాయ రంగానికి వ్యతిరేకంగా ఉందని అన్నారు సుఖ్ బీర్ సింగ్ బాదల్. అందుకే తాము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకంటున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకిస్తూ ఎన్ డీ ఎ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు సుఖ్ బీర్ సింగ్ బాదల్.
ఇది ఇలా ఉండగా ఈ బిల్లులు లోక్ సభలో ఆమోదం తర్వాత రాజ్యసభకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే రాజ్యసభలో ఏయే బిల్లులను చర్చించాలి, వేటిని సెలక్ట్ కమిటీకి పంపించాలి అనే అంశంపై ఇటీవలే కేంద్ర మంత్రి రాజ్ నాద్ సింగ్ విపక్షాలతో చర్చలుూ జరిపారు. అయితే అకాలీదళ్ ప్రభుత్వం నుండి తప్పుకున్నప్పటికీ ఎన్ డీ ఏలోనే కొనసాగుతుందన్న వార్తలు వస్తున్నాయి.