హైదరాబాద్: తెలంగాణ ప్రజా పద్దులు కమిటీ (పీఏసీ) పదవి ఎంఐఎం పార్టీకి వరించింది. ఆ పార్టీ శాసనసభ పక్షం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి పీఏసీ చైర్మన్ పదవి దక్కింది. దీంతో ఆయన కేబినెట్ హోదా పొందనున్నారు. ఎంఐఎం పార్టీకి ఈ పదవి వరించడం ఇదే తొలిసారి. పీఏసీ చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వడం అనేది సంప్రదాయం. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడంతో అసెంబ్లీలో ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. దీంతో ఆ హోదా టీఆర్ఎస్ మిత్రపక్షమైన మజ్లిస్ పార్టీకి దక్కింది. ప్రతిపక్ష సభ్యులు కూర్చోవాల్సిన స్థానాలను స్పీకర్ ఎంఐఎంకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలకు కేటాయించారు.
అసెంబ్లీ వాయిదా ప్రకటనకు ముందు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీ కమిటీలను ప్రకటించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా అక్బరుద్దీన్ ఓవైసీని నియమిస్తున్నట్టు తెలిపారు. అంచనాల కమిటీ చైర్మన్గా సోలిపేట లింగారెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్గా ఆశన్నగారి జీవన్రెడ్డిని నియమిస్తున్నట్టు వెల్లడించారు. పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యులుగా కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ప్రకాశ్ గౌడ్, అబ్రహం, శంకర్ నాయక్, దాసరి మనోహర్ రెడ్డి, నల్లమోతు భాస్కర్రావు, అహ్మద్ పాషా ఖాద్రీ, కోరుకంటి చందర్లను నియమించారు. ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది. పది రోజుల పాటు కొనసాగిన తెలంగాణ సమావేశాల్లో మూడు కీలక బిల్లులతో పాటు ఒక తీర్మానాన్ని ఆమోదించారు. సమావేశాలు 58 గంటల 6 నిమిషాలు కొనసాగాయి.