(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అలీగఢ్లో చిన్నారి పాపను హత్య చేసిన కేసులో నిందితుడు ఒకరు అయిదేళ్ల క్రితం తన సొంత కుమార్తెను మానభంగం చేశాడనీ, అయితే భార్య అతనిని కాపాడిందనీ పోలీసు వర్గాలు తెలిపాయి.
ఈ కేసులో పోలీసులు జాహిద్ అనే వ్యక్తినీ, అతని సహచరుడినీ అరెస్టు చేశారు. ఆ రెండేళ్ల పాప తాతకు ఇవ్వాల్సిన 10 వేల రూపాయల దగ్గర వచ్చిన గొడవ వల్ల జాహిద్ ఈ ఘోరానికి పాల్పడ్డాడు. అతనికి సహకరించిన రెండవ వ్యక్తి గతంలో తన సొంత కుమార్తె పైనే అత్యాచారం చేశాడనీ, భార్య అతనిని ఆదుకుందనీ పోలీసు వర్గాలు తెలిపాయి.
పాప పేరుతో హాష్ట్యాగ్ ట్విట్టర్లో వైరల్ కావడంతో ఈ ఘోర నేరం దేశం దృష్టిని ఆకర్షించింది. ప్రముఖులు మొదలుకుని సామాన్యుల వరకూ వేలమంది స్పందించారు. హంతకులను కఠినాతికఠినంగా శిక్షించాలన్న పిలుపులు వెల్లువెత్తుతున్నాయి.
అత్యాచారం సంగతి ఇంకా ధృవపడలేదని పోలీసులు అంటున్నారు. మొదట మీడియాలో వచ్చినట్లు పాప కళ్లు పీకిన మాట కూడా వాస్తవం కాదని వారు పేర్కొన్నారు. పాపను గొంతు పిసికి చంపారని వారు తెలిపారు. ఈ నేరంలో జాహిద్కు సహకరించిన వ్యక్తిని కూడా అరెస్టు చేశారు.
కేసు దర్యాప్తునకు ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశామని ఉన్నతాధికారులు తెలిపారు. అలసత్వం ప్రదర్శించినందుకు అయిదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. పిల్లలపై లైంగిక నేరాల నిరోధక చట్టం కింద కూడా కేసు పెట్టారు.
ఈ దారుణమైన నేరం చాలామందిని కదిలించింది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధి, శివసేన ప్రతినిధి ప్రియాంకా చతుర్వేది, సినీ నటుడు అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. మనిషనే వాడు ఒక పాప పట్ల అంత క్రూరంగా ఎలా ప్రవర్తించగలడు అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.