(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ: రేపటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో గురువారం పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో టిడిపి, వైసిపి ఎంపిల మధ్య స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకొన్నది.
ఏపిలో శాసనమండలి రద్దు, రాజధాని మార్పు అంశాలను పార్లమెంట్లో చర్చించాలని టిడిపి ఎంపిలు డిమాండ్ చేశారు. తనను అమరావతి ప్రాంతంలో అరెస్టు చేసిన అంశాన్ని టిడిపి ఎంపి గల్లా జయదేవ్ సమావేశంలో ప్రస్తావించారు. ఎంపిగా తన హక్కులను హరించే ప్రయత్నం చేశారని దీనిపై స్పీకర్కు ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు.
ఈ సందర్భంలో వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు కల్పించుకుని రాష్ట్ర స్థాయి అంశాలను ఇక్కడ ప్రస్తావించడం ఏమిటంటూ తప్పుబట్టారు. అమరావతి రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనీ, దీనిపై సిఐడి విచారణ కూడా జరుగుతోందని విజయసాయిరెడ్డి అన్నారు. రాజధాని మార్పు, మండలి రద్దు రాష్ట్రానికి సంబంధించిన విషయమని విజయసాయిరెడ్డి టిడిపి నేతలకు అడ్డుతగిలారు. వైసిపి ఎంపిల వాదనకు అడ్డుతగిలిన కేంద్ర మంత్రి రాజ్నాధ్ సింగ్ టిడిపి ఎంపిల అభిప్రాయాలకు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. సభలో చర్చించాలా లేదా అనేది తర్వాత బిఎసిలో నిర్ణయిస్తారనీ, చర్చించే అంశాలపై గొడవకు దిగడం సరికాదనీ రాజ్నాధ్ సింగ్ వైసిపి సభ్యులకు హితవు పలికారని టిడిపి రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ మీడియాకు తెలిపారు.
అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోది, కేంద్ర మంత్రులు అమిత్షా, వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లు పాల్గొన్నారు.