న్యూఢిల్లీ: ప్రధాని మోదీ అసమర్థ పాలన వల్లే దేశంలో ఆర్థికమాంద్యం ఏర్పడిందని మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. స్థూల దేశీయోత్పత్తి 5 శాతానికి పడిపోడం చూస్తే మందగమన ప్రభావం కనిపిస్తోందన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి ప్రధాని మోదీ ప్రభుత్వ పనితీరే కారణమని ఆరోపించారు. ఎదిగే అవకాశం ఉన్నా..అసమర్ధ నిర్వహణ వల్లే ఈ దుస్థితి తలెత్తిందని చెప్పారు. ఆటోమొబైల్ రంగంలో 3.5 లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారన్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలు లోపాల ప్రభావం ఇంకా చూపిస్తోందన్నారు. అసంఘటిత రంగంలోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. ఉపాధి లేక లక్షలాది మంది రోడ్డున పడుతున్నారని మన్మోహన్ వ్యాఖ్యానించారు.
దేశీయ వినిమయం తగ్గిందని.. వినియోగ వృద్ధి రేటు 18నెలల కనిష్ఠానికి పడిపోయిందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం తీవ్ర ఇబ్బందులకు గురైందని.. ఆదాయం పడిపోవడంతో రైతులు, వ్యవసాయ అనుబంధ రంగాల్లోని ప్రజలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని మన్మోహన్ సింగ్ తెలిపారు. అంతేకాదు ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి గల సంస్థల్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందని మన్మోహన్ సింగ్ మండిపడ్డారు. ప్రభుత్వానికి ఆర్బీఐ రూ.1.76 లక్షల కోట్ల నిధుల్ని బదిలీ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. బడ్జెట్ ప్రకటనలు, పథకాల అమలు తీరు విదేశీ ఇన్వెస్టర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందన్నారు. అంతర్జాతీయంగా పెరిగిన ఎగుమతుల అవకాశాల్ని అందిపుచ్చుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మన్మోహన్ విమర్శించారు.