అమరావతి: రాజధాని అంశం వివాదాస్పదం కావడంతో వైసిపి ప్రభుత్వంపై ముప్పేట దాడి జరుగుతోంది. మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారానికి కారణం అయ్యాయి.
ఒక పక్క అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు మూడు రోజులుగా రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. మరో పక్క ప్రధాన ప్రతిపక్షం టిడిపితో సహా బిజెపి, జనసేన పార్టీల నేతలు బొత్సా వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ప్రభుత్వ వైఖరిని వారు తప్పుబడుతున్నారు. రాజధానిని అమరావతి నుండి తరలించడానికి వీలులేదని స్పష్టం చేస్తున్నారు. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తొలగిపోయేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేయాలనీ కోరుతున్నారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిలు మంగళవారం రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటించారు. రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ వారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతులకు అండగా నిలవనున్నారు. కాంగ్రెస్ నేత తులసిరెడ్డి కూడా ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతున్నారు. ప్రభుత్వంపై ముప్పెటదాడి జరుగుతున్న జరుగుతున్న నేపథ్యంలో దీనిపై వెంటనే స్పష్టత ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 29న సిఆర్డిఎ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తరువాత దీనిపై ఒక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాజధాని భూసేకరణలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందనీ, పెద్ద ఎత్తున అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయని పలువురు వైసిపి మంత్రులు ఆరోపిస్తున్నారు.
బొత్సా వ్యాఖ్యల అనంతరం తిరుపతి మాజీ ఎంపి చింతా మోహన్ కూడా రాజధాని దొనకొండకు మార్పు చేయాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్టు తెలిసిందనీ, దొనకొండ కంటే తిరుపతి అన్ని విధాలుగా రాజధానికి అనుకూలమని పేర్కొన్నారు.
మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజధాని ప్రాంతం అంటే తుళ్లూరు ఒక్కటే కాదని, మంగళగిరి కూడా వస్తుందనీ, మంగళగిరి ప్రాంతంలో పది నుండి 15వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని తెలిపారు. బిజెపి రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ ఒక అడుగు ముందుకు వేసి రాజధాని మార్చే విషయంలో కేంద్రంతో సిఎం జగన్మోహనరెడ్డి చర్చలు జరిపారనీ, కడప, కర్నూలు, కాకినాడ, విశాఖపట్నం కేంద్రాలను రాజధాని ప్రాంతాలుగా అభివృద్ధి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇలా రాజకీయ నాయకులు ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతుండటం, ముఖ్యమంత్రి దీనిపై స్పష్టమైన వైఖరి వెల్లడించకపోవడంతో రాజధాని ప్రాంత రైతాంగంలో తీవ్ర ఆందోళన నెలకొన్నది.