(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: మూడు రాజధానుల బిల్లులు రెండింటినీ సెలక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్షం టిడిపి పట్టుబడుతున్నది. పరిపాలన వికేంద్రీకరణ, సిఆర్డిఎ రద్దు బిల్లులపై మండలిలో బుధవారం జరిగిన చర్చ ముగిసిన తర్వాత ఆ బిల్లుల భవితవ్యంపై చర్చ మొదలయింది. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని టిడిపి సభ్యుడు యనమల రామకృష్ణుడు వాదించారు. అలాంటి సంప్రదాయం లేదనీ, ఇప్పుడు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపడం కుదరదనీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి వాదించారు. ఈ ప్రతిష్టంభన ఫలితంగా ఛైర్మన్ సభను 15 నిముషాల సేపు వాయిదా వేశారు.
ఈ చర్చ సందర్భంగా 23 మంది మంత్రులు విధాన మండలిలో వచ్చి కూర్చున్నారు. బిల్లులపై చర్చ జరిగినంత సేపూ సాగిన సభా కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారం సెలక్ట్ కమిటీ అంశం చర్చకు రాగానే ఆగిపోయింది. మండలి ఛైర్మన్ ఎంఎ షరీఫ్ ఇరు పక్షాల వాదనలూ వింటున్నారు. చివరన ఆయన రూలింగ్ ప్రకారం జరుగుతుంది.
బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలన్న తమ ప్రతిపాదనపై వోటింగ్ జరపాలని యనమల పట్టు పడుతున్నారు. వోటింగ్ సమయంలో మండలిలో సభ్యులు కాని మంత్రులు బయటకు వెళ్లాలని కూడా ఆయన కోరుతున్నారు.