(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: అమరావతి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని జెఏసి నేతలు నిర్ణయించారు. ఉద్యమంలో భాగంగా బుధవారం రాజధాని గ్రామాల్లో మహా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు జెఏసి నేతలు తెలిపారు. బుధవారం రాజధాని గ్రామాల్లో దీక్షా శిబిరాలు ఉండవని ప్రకటించారు. మహా ప్రదర్శన కోసం ట్రాక్టర్లు, బైక్లు, ఇతర సాధనాలు వినియోగించనున్నట్లు తెలిపారు.
ఈ మహా ప్రదర్శనలో అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు, రైతు కూలీలు, మహిళలు పాల్గొననున్నారని జెఏసి నేతలు తెలిపారు. మహా ప్రదర్శనలో అయిదేళ్ల బాలుడు నుంచి 90 ఏళ్ల వృద్ధుల వరకూ పాల్గొంటున్నారనీ, బుధవారం ఉదయం తొమ్మది గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు మహాప్రదర్శన జరుగుతుందని చెప్పారు.
మహాప్రదర్శన ద్వారా రాజధాని గ్రామాల్లో ఉద్యమానికి కొత్త ఊపు వస్తుందని వారు పేర్కొన్నారు.
అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 42 రోజులుగా రైతులు, మహిళలు గ్రామాల్లో దీక్షా శిబిరాలు, నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. రాజధాని రైతుల ఆందోళనలకు మద్దతుగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో జెఏసి ఆధ్వర్యంలో రిలే దీక్షలు, నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.