(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: ఏపి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళన సోమవారం 20వ రోజుకు చేరింది. తుళ్ళూరు నుండి పదివేల మంది రైతులు, మహిళలు, యువకులతో మందడం వరకూ మహా పాదయాత్రను నిర్వహిస్తున్నారు.తమ పాదయాత్రను ఎవరూ అడ్డుకోలేరని రైతులు స్పష్టం చేస్తున్నారు.
మూడు రాజధానులు వద్దు- ఒక రాజధాని ముద్దు అంటూ నినాదాలు చేశారు. రాష్ట ప్రభుత్వ జిరాక్సు కాపీలుగా జిఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూపులు నివేదికలు మారాయని రైతులు ఆరోపిస్తున్నారు. రేపు వచ్చే హైపవర్ కమిటీ నివేదిక కూడా వీటికి కలర్ జిరాక్సు తప్ప మరోకటి కాదని అమరావతి పరిరక్షణ సమితి జెఎసి నేతలు విమర్శించారు. రాజధాని నిర్మాణానికి స్వచ్చందంగా భూములు
ఇచ్చిన రైతుల త్యాగాలను అవహేళన చేయడం దుర్మార్ఘమంటూ మండిపడుతున్నారు.
తుళ్లూరు, రాయపూడి, వెలగపూడి, మల్కాపురం, మందడం, మంగళగిరి, తాడేపల్లి తదితర గ్రామాల నుండి వేలాది మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
మరో పక్క సేవ్ అమరావతి స్లోగన్తో అమరావతి రైతుల ఆందోళనకు మద్దతుగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాలో రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు నిరసన ప్రదర్శనలు, దీక్షలు కొనసాగిస్తున్నాయి.