(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు, మహిళలు నిర్వహిస్తున్న ఆందోళనలు 48వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 48వ రోజు రిలే దీక్షలు చేపట్టారు. ఎర్రబాలెం, ఉద్దండరాయునిపాలెం తదితర రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మందడం, వెలగపూడి గ్రామాలలో 24 గంటల దీక్షకు రైతులు కూర్చున్నారు. మూడు రాజధానులు వద్దు -ఒక రాజధానే ముద్దు, జై అమరావతి -జై జై అమరావతి అంటూ నినాదాలు చేస్తున్నారు. 48 రోజులుగా రాజధాని గ్రామాలలో ఆందోళనలు జరుగుతున్నా పట్టించుకోకుండా మంత్రులు, వైసిపి ఎమ్మెల్యేలు మూడు రాజధానులకు అనుకూలంగా సభలు పెడుతూ అమరావతి రైతుల ఉద్యమాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన విరమించుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు.