అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 55వ రోజుకు చేరాయి. నిరసన కార్యక్రమాలను శాంతియుతంగా కొనసాగిస్తున్నారు. వివిధ రూపాల్లో ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్న రైతులు, మహిళలు నేడు న్యాయమూర్తులకు తమ ఆవేదన తెలిపేందుకు విన్నూత్న రీతిలో నిరసన తెలిపారు. న్యాయమూర్తులు హైకోర్టుకు వెళ్లే మార్గంలో రాయపూడి వద్ద రహదారికి ఇరువైపులా రైతులు, మహిళలు బారులు తీరి దండం పెడుతూ నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. న్యాయమూర్తులైనా తమ మొర ఆలకిస్తారని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. మరో పక్క మూడు రాజధానులకు వ్యతిరేకంగా మందడం, వెలగపూడి, తుళ్లూరులో మహా ధర్నాలు కొనసాగుతున్నాయి. కృష్ణాయపాలెం శివాలయం సెంటరులో ప్రయాణికులకు రైతులు గులాబీ పూలను అందిస్తూ నిరసన తెలిపారు. 55 రోజులుగా తాము శాంతియుతంగా నిరసన తెలియచేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాజధాని అమరావతి లోనే కొనసాగిస్తామని హామీ వచ్చే వరకు ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని రైతులు చెబుతున్నారు. అమరావతి రైతుల ఆందోళన కు మద్దతుగా వివిధ ప్రాంతాలలో రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు.