(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతం వెలగపూడిలో అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకున్నది. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 54 రోజులుగా అమరావతి గ్రామాలలో ఆందోళనలు నిర్వహిస్తుండగా, వైసీపీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలకు కనువిప్పు కలిగి రాజధానిపై మనసు మార్చుకోవాలని ఇద్దరు యువకులు చేపట్టిన 151 గంటల నిరాహార దీక్షను పోలీసులు ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో భగ్నం చేయడంతో మరో సారి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. హైకోర్టు ఆదేశాల మేరకు రాజధాని ప్రాంతంలో నిరసనల జోలికి పోలీసులు వెళ్లడం లేదు. దీనితో కొద్దిరోజులుగా ధర్నా, నిరాహార దీక్షలు, ప్రదర్శనలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. అయితే వెలగపూడిలో బొర్రా రవి, తాడికొండ శ్రీకర్ అనే యువకులు 151 గంటల దీక్షను కొనసాగిస్తుండగా వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోయాయని వైద్య పరీక్షల్లో తేలడంతో పోలీసులు రంగప్రవేశం చేసి దీక్షను భగ్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులను రైతులు, మహిళలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్థ పరిస్థితి ఏర్పడింది. పోలీసులు బలవంతంగా వారి అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు.