అమరావతి: రాష్ట్రానికి మూడు రాజధానులంటూ సిఎం జగన్మోహనరెడ్డి ప్రకటనతో రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న రాజధాని ప్రాంత రైతాంగానికి వైసిపి నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హీరో అయ్యారు. అధికార పార్టీ నుండి మొట్టమొదటి సారిగా గళం విప్పి పరిపాలనంతా ఒక చోట నుండే జరిగితే బాగుటుందని గోపిరెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో రాజధాని ప్రాంత రైతులు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. నిరసన కార్యక్రమాల్లో ఆయన ఫోటోను ప్రదర్శిస్తూ హాట్సాఫ్ చెబుతున్నారు. అధినేతకు భయపడి స్థానిక ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోయినా గోపిరెడ్డి రాజధాని అమరావతికి అనుకూలంగా మాట్లాడటం తమకు చాలా సంతోషంగా ఉందని రైతులు పేర్కొంటున్నారు.
రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాలకు ప్రాతినిధ్యం వహించే తాడికొండ, మంగళగిరి నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలు ఈ వ్యవహారంపై ఇంత వరకూ నోరు మెదపడలేదు. తీవ్ర ఆందోళనతో కుటుంబాలు కుటుంబాలు రోడ్డుపైకి వచ్చి తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు సంఘీభావం తెలుపకపోవడాన్ని రైతులు తప్పు బడుతున్నారు.