(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు 43వ రోజుకు చేరాయి. అమరావతి పరిరక్షణ సమితి (జెఏసి) పిలుపు మేరకు తుళ్లూరు నుండి మందడం వరకూ భారీ వాహన ర్యాలీ ప్రారంభమయ్యింది. ఈ ర్యాలీని మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిపిఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావులు ప్రారంభించారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో రైతులు, రైతు కూలీలు, మహిళలు పాల్గొన్నారు. ద్విచక్రవాహనాలు, కార్లు, ఆటోలు, ట్రాక్టర్లతో వేలాది మంది ఈ మహాప్రదర్శనలో పాల్గొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేస్తున్నారు.
మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకూ పోరాటాన్ని కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు.
రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల మీదుగా ఈ ప్రదర్శన కొనసాగనుంది. రాయపూడి, ఉద్దండరాయునిపాలెం, మోదు లింగాయపాలెం, వెలగపూడి, మల్కాపురం, మందడం, కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రు, కురగల్లు, పెదపరిమి, నెక్కల్లు, అనంతవరం, వడ్లమాను, హరిచంద్రపురం, బోరుపాలెం, దొండపాడు గ్రామాల మీదుగా ర్యాలీ తిరిగి తుళ్లూరు చేరనున్నది.
మహాప్రదర్శన నిర్వహిస్తున్నందున రాజధాని గ్రామాల్లో నేడు మహాధర్నాలు చేపట్టలేదు. అమరావతి రైతుల ఆందోళనలకు మద్దతుగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో జెఏసి ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.