(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి : ఏపీ రాజధాని అమరావతి రైతులు, మహిళలు పలువురు శనివారం తెలంగాణ రాష్ట్రంలోని మేడారం మహా జాతరకు తరలి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని సమ్మక్క, సారలమ్మను వేడుకుని పొంగళ్ళు సమర్పించారు. సీఎం జగన్ మనసు మార్చాలని వనదేవతలకు బంగారం సమర్పించి మొక్కుకున్నారు. వనదేవతల ఎదుట మహిళలు మహిళా రైతులు తమగోడు వెళ్లబోసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మూడు రాజధానులు వద్దు, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ప్రార్థించారు. ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేశారు. వనదేవతలు తమకు న్యాయం చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. రైతులు ములుగు ఎమ్మెల్యే సీతక్కను మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం సీతక్క రైతులకు మెమెంటోలు అందజేసి దుశాలువాతో సత్కరించారు.