(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి : అమరావతి రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోళ్లపై విచారణ జరపాలని కోరుతూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని సిఐడీ కోరింది. ఇప్పటికే ఇద్దరు మాజీ మంత్రులపై కేసు నమోదు చేసిన సిఐడి.. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా విచారణ ముమ్మరం చేసింది. అమరావతిలో నాలుగు వేల ఎకరాల భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్టుగా కేబినెట్ సబ్కమిటీ నివేదిక సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ నివేదిక ఆధారంగా భూములు కొనుగోలు చేసిన రాజకీయ నాయకులను సీఐడీ విచారణ చేయనున్నది.
అమరావతి కోర్ కాపిటల్ ఏరియాలో 720 ఎకరాల భూమిని తెల్లరేషన్ కార్డు హోల్డర్స్ కొనుగోలు చేసినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. మొత్తంగా 790 మంది తెల్ల రేషన్ కార్డు హోల్డర్లకు అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు.
అమరావతి భూముల కొనుగోలుపై విచారణ చేయాలనీ కోరుతూ ఈడికి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ లేఖ రాశారు. భూ డాక్యుమెంట్లతో పాటు, తెల్లరేషన్ కార్డు హోల్డర్ల వివరాలను ఈడీకి పంపించారు. సిఐడి విజ్ఞప్తి మేరకు ఈడీ రెండు రోజుల్లో రంగంలోకి దిగవచ్చని సమాచారం.