అమరావతి: ఏపీ రాజధాని అమరావతి కథ మళ్లీ మొదటికి వచ్చింది. రాజధానిని అమరావతి నుండి మారుస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో.. ఈ అంశంపై సీఎం జగన్ సీఆర్డీఏ అధికారులతో రెండు గంటల సేపు సమీక్ష నిర్వహించారు. రాజధానిపై జరుగుతున్న చర్చకు జగన్ ముగింపు ఇస్తారని అందరూ భావించారు. అయితే, సీఎం జగన్ సమీక్ష.. రాజధానిలో నిర్మాణాల పురోగతి..బ్యాంకు గ్యారెంటీలు..ఆర్దిక నిర్వహణపైనే చర్చ సాగింది. రాజధానిపైన జరుగుతున్న చర్చ గురించి ప్రస్తావించ లేదు. రైతులకు చెల్లించాల్సిన కౌలు.. స్థలాల కేటాయింపు మీద చర్చ జరిగింది.
రాజధాని అంశంపై వాస్తవాలు పరిశీలించామని, ముంపు సమస్య చర్చకు రాలేదని సమీక్ష అనంతరం మంత్రి బొత్స తెలిపారు. రాజధాని విషయంలో ఎవరికీ అనుమానల్లేవని పేర్కొన్నారు. రాజధాని గురించి ఎవరో ఏదో చెబితే తనకేంటి సంబంధం అని ఆయన ఎదురు ప్రశ్నించారు. రాజధానికి సంబంధించి రూ.35వేల కోట్లతో టెండర్లు పిలిచారని, ఆర్థిక పరిస్థితులు చూసి ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తామని తెలిపారు. రాజధాని 5 కోట్ల మంది ప్రజలదని, ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందినది కాదని మరోసారి పునరుద్ఘాటించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళుతోందన్నారు. ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష లేదని స్పష్టం చేశారు. ఏపీలోని 13 జిల్లాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. రాజధానిలో నిర్మాణ వ్యయం ఎక్కువగా ఉందని..75 శాతం పూర్తయిన వాటిని కొనసాగిస్తామని ప్రకటించారు. మిగిలిన వాటి పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతిలోనే ఉంటుందా లేదా అన్నది ఇంకా సస్పెన్స్ గానే మారింది.
ఇటీవల రాజధాని తరలింపుపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు రాజకీయాంగా కలకలం రేపాయి. రాజధాని తరలింపుపై టీడీపీ, బీజేపీ, జనసేన సహా విపక్ష పార్టీలు అన్నీ తీవ్రంగా ఖండించాయి. అమరావతిలో తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణాలు కొనసాగాల్సిందేనని టీడీపీ డిమాండ్ చేస్తోంది. తాము రాజధానిని మార్చమని, అయితే ముంపుప్రాంతాన్ని గత ప్రభుత్వం రాజధానిగా ఎంపిక చేసుకుందని వైసీపీ వాదిస్తోంది. మరోవైపు రాజధానికి భూములిచ్చిన రైతులు కూడా రోడ్డుపై బైఠాయించిన ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్.. తాజా సమీక్షతో ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెడతారని భావించారు. అయితే అందరని అంచనాలు తల కిందులయ్యాయి. దీంతో రాజధాని మార్పు వ్యవహారం మీద రచ్చ మరి కొంత కాలం కొనసాగే అవకాశం కనిపిస్తోంది.