అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు తీవ్రతరం అవుతున్నాయి . పోలీసులు అనేక ఆంక్షలు విధిస్తున్నా అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున రైతులు, మహిళలు, యువతీ యువకులు పాల్గొంటున్నారు. రాజధాని ప్రాంత గ్రామాలతో 22 రోజులుగా రైతులు రిలే దీక్షలు, నిరసనలు కొనసాగిస్తుండగా వీరి ఆందోళనకు మద్దతుగా విజయవాడతో సహా పలు జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ప్రదర్శన ప్రదర్శనలు, రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు. టిడిపి, సిపిఐ, సిపిఎం, జనసేన పార్టీలతో పాటు ప్రజా సంఘాలు ఆందోళన కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాయి.
రాజధాని ప్రాంత గ్రామాల్లో మొన్న పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించగా అమరావతి పొలిటికల్ జెఎసి పిలుపు మేరకు నిన్న జాతీయ రహదారుల దిగ్భంధన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసు యంత్రాంగం వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులతో పాటు జెఎసి నేతలను హౌస్ అరెస్టు చేయడంతో పాటు పలువురు నేతలను అరెస్టు చేసి స్టేషన్కు తరలించినా పెద్ద ఎత్తున రైతాంగం జాతీయ రహదారిపై చిన కాకాని వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
బుధవారం మందడంలో టెంట్ వేయడానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో రహదారిపైనే రైతులు దీక్షకు దిగారు. ఎండ తీవ్రతకు ఇద్దరు రైతులు సొమ్మసిల్లి పడిపోవడంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. షామియానాకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళనల నేపథ్యంలో సోమవారం నాడు అరెస్టు అయి గుంటూరు సబ్ జైలులో ఉన్న 18మంది రైతులను బుధవారం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో సహా జనసేన, వామపక్షాల నేతలు పరామర్శించారు. తాజాగా హైవే దిగ్బంధం కేసులో మరో 18మంది రైతులపై మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై దాడి కేసులో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో సిపి గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. ప్రభుత్వ విప్ పిన్నెల్లిపై దాడి ఘటనకు డిజిపి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా రాజధాని రైతుల ఆందోళన, శాంతి భద్రతలు తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.