(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించేందుకు ఢిల్లీ స్థాయిలో ఆందోళనలకు రైతులు సిద్ధం కావాలని టిడిపి నేత మాజీ ఎంపి మాగంటి బాబు పిలుపునిచ్చారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు 45వ రోజుకు చేరాయి. మూడు రాజధానులకు వ్యతిరేకంగా రాజధాని ప్రాంత గ్రామాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో రైతులు చేస్తున్న ఆందోళనలో మాగంటి బాబు పాల్గొని సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే చోట నుండి సాగాల్సిన పరిపాలన వేర్వేరు చోట్లకు మార్చడం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదని అన్నారు. రైతు బిడ్డగా వారి ఆవేదన తనకు తెలుసునని పేర్కొన్నారు. అమరావతి రైతుల ఆందోళన జాతీయ స్థాయికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
మందడం, తుళ్లూరు, వెలగపూడి తదితర గ్రామాల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం మనసు మారాలని దేవుడిని ప్రార్థిస్తూ పలు గ్రామాల్లోని ఆలయాల్లో రైతులు పూజలు నిర్వహిస్తున్నారు.