అమరావతి: రైతులపై లాఠీచార్జికి నిరసనగా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు అమరావతిలోని 29 గ్రామాల్లో బంద్ కొనసాగుతోంది. రైతులకు మద్దతుగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. పోలీసులకు పూర్తిగా సహాయనిరాకరణ చేయాలని రైతులు నిర్ణయించారు. మంచినీరు సహా ఏ పదార్ధాలు పోలీసులకు విక్రయించరాదని నిర్ణయించారు.
రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు 35వ రోజుకు చేరుకున్నాయి. శాసనసభలో పరిపాలన వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందినా రైతులు తమ నిరసనలు ఆపడంలేదు. మందడం, తుళ్లూరులో మహాధర్నాలు వెలగపూడి, కృష్ణాయపాలెంలో రైతు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ఉద్దండరాయునిపాలెంలో రైతులు, మహిళలు నిరసన తెలుపుతూ పూజలు నిర్వహిస్తున్నారు. వికేంద్రీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ మందడంలో ఉదయం నుంచి రైతులు నిరసన చేపట్టారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందినంత మాత్రాన తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రైతుల అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.
మరోవైపు రాజధాని పరిధిలోని అన్నిగ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. రైతులు అసెంబ్లీ ముట్టడికి యత్నించే అవకాశముందని భావించిన పోలీసులు ఎక్కడికకకడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. సచివాలయానికి వెళ్లే మార్గంలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. సచివాలయం వెనుకవైపు కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి పరిధిలోని గ్రామాలతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల్లో ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు రాజధానిపై ఆందోళనలు కొనసాగిస్తున్నాయి.
అమరావతి మార్పునకు నిరసనగా సోమవారం(జనవరి 20) అసెంబ్లీ ముట్టడికి రాజధాని రైతులు యత్నించారు. అసెంబ్లీ వైపు దూసుకు వస్తున్న మహిళలు, యువకులు, వృద్ధులు పిల్లలను చూసి పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ గేటు వద్దకు రానివ్వకుండా రైతులపై లాఠీలు ఝళిపించారు. మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా విరుచుకుపడ్డారు. వెంటబడి తరుముతూ చేతికి అందినవారిని అందినట్లు చితకబాదారు. పోలీసు లాఠీ దెబ్బలకు తట్టుకోలేకపోయిన రైతులు ఒక దశలో తిరగబడి పొలాల్లో చేతికి అందిన రాళ్లను పట్టుకుని విసిరారు. దీంతో అసెంబ్లీ వెనుకవైపు భాగం ఒక దశలో రణరంగాన్ని తలపించింది.