(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: అమరావతిలో రైతుల ఆందోళన నేపథ్యంలో రాజధాని ప్రాంత వైసిపి ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకొంది. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో వీరు సమావేశం అవుతున్నారు. ఎన్నికలకు ముందు ఆ పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు రాజధాని అమరావతిలోనే ఉంటుందనీ, ఇక్కడ నుండి రాజధానిని తరలించే ఆలోచన వైసిపికి లేదంటూ ప్రకటించారు. ఇటీవల అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రకటన చేయడం, దానికి అనుగుణంగా జిఎన్ రావు కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందజేయడంతో అమరావతి ప్రాంత రైతులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. అమరావతి నుండి రాజధానిని తరలించడానికి వీలులేదంటూ తొమ్మిది రోజులుగా రాజధాని ప్రాంత గ్రామాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆందోళనకు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో పాటు బిజెపి, ఇతర రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలియజేస్తున్నాయి. రాజధాని ప్రాంతంలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాజధానిపై ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పదవులకు రాజీనామా చేయాలని టిడిపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. వీరి రాజీనామాల ద్వారా వచ్చే ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులను పోటీకి నిలపదని కూడా చెబుతున్నారు. రాజధానిపై తీవ్ర ఆందోళన చెందుతూ తొమ్మిది రోజులుగా నిరసనలు నిర్వహిస్తుంటే ఈ ప్రాంత వైసిపి ఎమ్మెల్యేలు వచ్చి సంఘీభావం ప్రకటించకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు వైసిపి నేతలు ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు.
ఈ సమావేశానికి వైసిపి అగ్రనేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, మంగళగిరి, తాటికొండ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉండవల్లి శ్రీదేవి హజరుకానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా మూడు రాజధానుల ప్రతిపాదన, రాజధాని రైతుల ఆందోళనపై చర్చించనున్నట్లు సమాచారం.
రేపు సిఎం జగన్మోహనరెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానున్న సంగతి తెలిసిందే. కేబినెట్ భేటీలో రాజధాని విషయంపై కీలక ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో ఒక రోజు ముందే ఈ సమావేశం జరగడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.