(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని సదర్ బజార్లో వ్యాపారులు అందరూ కలిసి ధర్నా చేశారు. దానితో అసలే రద్దీగా ఉండే ఆ ప్రాంతం గందరగోళంగా మారింది. ‘అమెజాన్ ప్లిప్కార్ట్ గోబ్యాక్, గోబ్యాక్’ అన్న నినాదాలతో సదర్ బజార్ దద్దరిల్లింది. గత బుధవారం దేశవ్యాప్తంగా ఇలాంటి నిరసన ధ్వనులు వినిపించాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ (ఇప్పుడు ఫ్లిప్కార్ట్ సంస్థ వాల్మార్ట్ అధీనంలో ఉంది) వంటి ఆన్లైన్ సేల్స్ సంస్థలపై దేశంలోని రిటైల్ వ్యాపారులు ఎందుకు కన్నెర్ర చేశారు? ఎందుకు చిన్న వ్యాపారులు ఇ-కామర్స్ దిగ్గజాలను వ్యతిరేకిస్తున్నారు?
ఇ-కామర్స్ సంస్థలు చిన్న వ్యాపారులను భక్షించే పద్ధతిలో వస్తువుల ధరలు భయంకరంగా తగ్గించి వ్యాపారం చేస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. దీనిని ప్రిడేటరీ ప్రైసింగ్ అంటున్నారు. స్థానిక చిన్న వ్యాపారులను కాపాడేందుకు ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను ఈ దిగ్గజాలు ఉల్లంఘిస్తున్నాయని వారు అంటున్నారు.
ప్రిడేటరీ ప్రైసింగ్ ఆరోపణలపై కేంద్రప్రభుత్వం గత అక్టోబర్లో విచారణకు ఆదేశించింది. అయితే తాము చేస్తున్న వ్యాపారం ఇండియా నిబంధనలకు విరుద్ధం కాదని అమెజాన్, వాల్మార్ట్ అంటున్నాయి. వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్ విక్రయాలు జరిపే ఆ సంస్థలు తమ వెబ్సైట్లు థర్డ్ పార్టీ మార్కెట్లేనని అంటున్నాయి.
ఇండియాలో చిన్న వ్యాపారులు సుమారుగా ఏడు కోట్ల మంది ఉంటారు. దేశంలో జరిగే చిల్లర వ్యాపారంలో 90 శాతం వాటా వీరిదే. వీరిలో ఎక్కువ మంది బిజెపి మద్దతుదారులు కాబట్టి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వీరికి వ్యతిరేకంగా ఏమీ చేయడానికి సాహసించదు. విదేశీ రిటైల్ సంస్థల ప్రవేశానికి మోదీ ప్రభుత్వం అంత కఠినమైన ఆంక్షలు విధించినదానికి కారణం ఇదే. ఆ ఆంక్షల వల్లనే వాల్మార్ట్ వంటి రిటైల్ సంస్థలు ఇండియావైపు చూడడం మానుకున్నాయి.
ఈ దుకాణదారుల వత్తిడి కారణంగానే గత సంవత్సరం అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఇ-కామర్స్ దిగ్గజాలపై కేంద్రం మరిన్ని ఆంక్షలు విధించింది. ఇప్పుడు ఈ సంస్థలు కేంద్రం విధించిన నిబంధనలను దొడ్డి దారిన ఉల్లంఘిస్తున్నాయని చిన్న వ్యాపారులు ఆరోపిస్తున్నారు. తమ వెబ్సైట్ కేంద్రంగా ఉత్పత్తులు విక్రయించే సంస్థలే ధరలు నిర్ణయిస్తాయి తప్ప తమ ప్రమేయం లేదని ఇ కామర్స్ సంస్థలు అంటున్నాయి.
గత అక్టోబర్లో వచ్చిన దీపావళి పండగ సందర్భంగా ఇ కామర్స్ సంస్థలు జరిపిన బంపర్ విక్రయాలు చిన్న వ్యాపారులను రోడ్డు పైకి తెచ్చాయి. ఈసారి దీపావళి షాపింగ్ సేల్స్ 60 శాతం పడిపోయిందని చిన్న వ్యాపారులు అంటున్నారు. అమెజన్, ఫ్లిప్కార్ట్ మాత్రం రికార్డు సేల్స్ చేశాయి. నిబంధనలు ఉల్లంఘిస్తేనే ఇంత సేల్స్ సాధ్యమని చిన్న వ్యాపారులు పట్టు బట్టడంతో వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ విచారణకు ఆదేశించారు. ఇ కామర్స్ను కంట్రోల్ చేసేందుకు ఒక నియంత్రణా యంత్రాంగం ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.