(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఇకమీదట అమెరికా వెళ్లాలనుకునే వారు తమ సోషల్ మీడియా వివరాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది. అమెరికా వచ్చేవారందరనీ పూర్తి స్థాయిలో వడపోయాలని ఆ ధేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫర్యవసానం ఇది. ఇంతవరకూ, వివిధ దేశాలు పర్యటించిన వారు, ముఖ్యంగా ఉగ్రవాద సంస్థల ప్రాబల్యం ఉన్న దేశాలకు వెళ్లినవారు మాత్రమే ఈ వివరాలన్నీ ఇవ్వాల్సివచ్చేది.
తాజాగా అమెరికా విదేశాంగ శాఖ అమలులోకి తెచ్చిన నిబంధనల ప్రకారం చదువుకునేందుకూ, ఉద్యోగం చేసేందుకూ అమెరికా వెళ్లాలనుకునే వారు అందరూ సోషల్ మీడియా సైట్లలో తమ ఖాతాల వివరాలు, గత అయిదేళ్ల ఇమెయిల్ ఖాతాల వివరాలు, ఫోన్ నంబర్లు ఇవ్వాల్సిఉంటుంది. గత సంవత్సరమే ఈ నిబంధనలను అమలు చేయాలనుకున్నారు. ప్రతిఏటా ఒక కోటీ 47 లక్షల మంది ఈ నిబంధనలకు లోబడాల్సివస్తుందని అప్పట్లో అంచనా వేశారు.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవిలోకి వచ్చిన తర్వాత వలస చట్టాలను మరింత కఠినంగా తయారు చేస్తున్నారు. గత సంవత్సరం ఈ నిబంధనలు అమలు చేయాలనుకున్నపుడు అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ అభ్యంతరం చెప్పింది. సోషల్ మీడియా ఖాతాలపై దృష్టి పెట్టినందువల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుదన్న హామీ లేదనీ, పైగా ఇది న్యాయం కూడా కాదనీ ఆ సంస్థ పేర్కొన్నది. దీనివల్ల సోషల్ మీడియాలో ప్రజలు స్వీయ సెన్సారింగ్కు పాల్పడే ప్రమాదం ఉదనీ, అది భావప్రకటన స్వేచ్ఛను ప్రమాదంలో పడేస్తుందనీ ఆ మానవహక్కుల సంస్థ పేర్కొన్నది.