ఎన్నికలను అద్భుతంగా నిర్వహించారు
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల విషయంలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తుంటే.. ఎన్నికల సంఘం భేషుగ్గా పనిచేసిందని, సార్వత్రిక ఎన్నికలను అద్భుతంగా నిర్వహించిందని మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు కురిపించారు. ‘‘మనం వ్యవస్థలను బలోపేతం చేయాలంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సంస్థలు దేశానికి సేవ చేస్తున్నాయి. ప్రజాస్వామ్యం విజయవంతం అవుతోందంటే, సుకుమార్ సేన్ నుంచి ప్రస్తుతం ఉన్నవారి వరకు ఎన్నికల కమిషనర్లందరూ ఎన్నికలను కచ్చితంగా నిర్వహించడం వల్లే. వాళ్లందరూ తమ పనిని బాగా చేస్తున్నారు. వాళ్లను విమర్శించడం సరికాదు. ఈసారి ఎన్నికలు అద్భుతంగా నిర్వహించారు’’ అని ఆయన అన్నారు. సోనియా సింగ్ రాసిన ‘‘డిఫైనింగ్ ఇండియా త్రూ దైర్ ఐస్’’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
సంస్థలన్నీ చాలా బాగున్నాయని.. ఇవి కొన్నేళ్లుగా నిర్మితం అవుతున్నాయని ప్రణబ్ దా అన్నారు. కేవలం చెడ్డ పనివాడు మాత్రమే తన పనిముట్లతో గొడవ పడతాడని, మంచి పనివాడు వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుని ఉంటాడని చెప్పారు. యూపీయే హయాంలో ఆర్థిక మంత్రిగాను, తర్వాత దేశానికి 13వ రాష్ట్రపతిగాను సేవలు అందించిన ప్రణబ్ ముఖర్జీ.. దేశ పౌరులు ఎన్నికలలో పాల్గొన్న విధానాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు. సార్వత్రిక ఎన్నికల్లో 67.3% మంది పాల్గొన్నారని, ఇది 2/3 వంతు కంటే ఎక్కువని చెప్పారు. చాలా సంవత్సరాల తర్వాత తాను ప్రణబ్ ముఖర్జీ అనే సామాన్య పౌరుడిగా తన ఓటును ఎన్నికల కేంద్రంలో వేయగలిగానని చెప్పారు.
ఎన్నికల సంఘం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తొత్తుగా మారిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర నేతలు తీవ్రంగా విమర్శిస్తున్న తరుణంలో ప్రణబ్ ఈసీని ప్రశంసించడం విశేషం. ఎన్నికల బాండ్లు, ఈవీఎంలు, షెడ్యూలును కావాల్సినట్లు ఇవ్వడం, నమో టీవీ, మోదీ ఆర్మీ, ఇప్పుడు కేదార్ నాథ్ లో డ్రామా… వీటన్నింటిలో ఎన్నికల సంఘం మోదీ గ్యాంగు ముందు మోకరిల్లిందని రాహుల్ విమర్శించారు. ఒకప్పుడు ఈసీ అంటే గౌరవం, భయం ఉండేవని.. ఇప్పుడు అవేమీ లేవని ట్వీట్ చేశారు.