హైదరాబాద్ః జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయం పూర్తిగా నెరవేరిందని కేంద్ర కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. దశాబ్దాలుగా జఠిలంగా ఉన్న కశ్మీర్ సమస్యను ప్రధాని మోదీ పరిష్కరించారని తెలిపారు. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 70వ బ్యాచ్ ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. స్వదేశీ సంస్థానాల విలీనం కోసం పటేల్ చేసిన కృషి ఎప్పటికీ మరిచిపోలేనిదన్నారు. ఐపీఎస్ సాధించడంతోనే యువత ఆశయం పూర్తయినట్లు కాదని, నిజాయతీగా సేవ చేసి దేశాభివృద్ధికి పాటుపడాలని అమిత్ షా సూచించారు. పోస్టింగ్ ఎక్కడ ఇచ్చినా అందరితో సమన్వయం చేసుకుంటూ సత్ఫలితాలు సాధించాలన్నారు. రాజ్యాంగస్ఫూర్తి దెబ్బతినకుండా, ధైర్యంగా విధులు నిర్వహించాలి అని అమిత్ షా ఐపీఎస్లకు సూచించారు.
70వ ఐపీఎస్ బ్యాచ్లో మొత్తం 92 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ బ్యాచ్ నుంచి తెలుగు రాష్ట్రాలకు ముగ్గురు చొప్పున ఐపీఎస్లను కేటాయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి, తెలంగాణ గవర్నర్ నరసింహన్, తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తదితరులు హాజరయ్యారు.