కోడ్ ఉల్లంఘించలేదన్న ఎన్నికల కమిషన్
ఒక కమిషనర్ ది మాత్రం భిన్నాభిప్రాయం
న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు లైన్ క్లియరైంది. ఎన్నికల ప్రసంగాలలో కోడ్ ఉల్లంఘించలేదని ఈసీ స్పష్టం చేసింది. అయితే, ముగ్గురు కమిషనర్లలో ఒకరు మాత్రం ఈ అభిప్రాయంతో విభేదించారని ‘ద ఇండియన్ ఎక్స్ ప్రెస్’ తెలిపింది. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రెండోస్థానంయ వయనాడ్ ను అమిత్ షా పాకిస్థాన్ తో పోలుస్తూ నాగపూర్ లో ప్రసంగించారు. దీన్ని 2-1 మెజారిటీతో కమిషన్ కొట్టేసింది. ‘‘ఈ రాహుల్ బాబా తన కూటమి కోసం కేరళలో ఎలాంటి స్థానానికి వెళ్లి నిలబడ్డారో తెలుసా? అది భారతదేశమా లేదా పాకిస్థానా అన్నది కూడా తెలియడం లేదు. అలాంటిచోటకు వెళ్లి నిలబడ్డారు’’ అని ఆయన అన్నారు. వయనాడ్ లో రాహుల్ నామినేషన్ దాఖలుచేసేటపుడు ఐయూఎంఎల్ పార్టీకి చెందిన ఆకుపచ్చ జెండాలు పెద్దసంఖ్యలో కనడపడటంతో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ‘‘ఈ విషయాన్ని ఎన్నికల నిబంధనావాళిలోని అన్ని అంశాల ప్రకారం వివరంగా పరిశీలించాం. నాగపూర్ జిల్లా ఎన్నికల అధికారి పంపిన ఆరు పేజీల రాతప్రతిని పూర్తిగా పరిశీలించిన తర్వాత, ఎన్నికల నిబంధనావళిని గానీ, ఈసీఐ సూచనలను గానీ ఉల్లంఘించినట్లు ఎక్కడా కనపడలేదని ఎన్నికల సంఘం అభిప్రాయపడుతోంది’’ అని ఆయనకు సమాధానం పంపారు. అయితే, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలపై కోడ్ ఉల్లంఘనకు సంబంధించి కనీసం మరో మూడు ఫిర్యాదులు పెండింగులో ఉన్నాయి.
మరోవైపు రాహుల్ గాంధీకి తాము ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు ఈనెల 7వ తేదీ వరకు ఎన్నికల సంఘం గడువు పొడిగించింది. మధ్యప్రదేశ్ లోని ఒక ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, గిరిజనులను చంపడానికి అనుమతి ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టం చేసిందని అన్నారు. కేంద్రమంత్రి మహేశ్ శర్మ, గోవా మంత్రి మార్విన్ గోడిన్హోలు కూడా కోడ్ ఉల్లంఘించారని వారికి నోటీసులు వెళ్లాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో మార్చి 17న చేసిన వ్యాఖ్యలపై కమిషన్ తప్పుబట్టింది. భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.