పరిపాలనలో తనదైన మార్క్ తో దూసుకువెళుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న పలు నిర్ణయాలు ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో దుబారా వ్యయం నివారణ అయి పెద్ద మొత్తంలో ఆదా చేస్తున్నాయి. ఇప్పటికే కాంట్రాక్టు వ్యవస్థలో రివర్స్ టెండరింగ్ వల్ల కోట్లాది రూపాయలు ఆదా అయిన విషయం తెలిసిందే. అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు హయాంలో చేపట్టిన ఒ భారీ ప్రాజెక్టు కు జగన్మోహన్ రెడ్డి సర్కార్ పలు మార్పులు చేయడంతో ఏకంగా రూ. 3500 కోట్ల ఖర్చు తగ్గింది. ఈ మార్పులకు కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది.
విషయంలోకి వెళితే..టీడీపీ హయాంలో అనంతపురం – అమరావతి ఎక్స్ప్రెస్ వే నిర్మాణాన్ని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ ఎక్స్ప్రెస్ వేను కోల్కతా – చెన్నై (ఎన్హెచ్ 16) రహదారికి సమాంతరంగా నిర్మించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం భావించింది. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మాణంలో మార్పులు చేపట్టింది. అనంతపురం – అమరావతి ఎక్స్ప్రెస్ వేను ఎన్హెచ్ 16కు సమాంతరంగా నిర్మించడానికి బదులు ఎన్హెచ్ 16తో అనుసంధానం చేసేలా నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపగా కేంద్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ప్రాజెక్టులో మార్పులు చేయడం వల్ల ఈ ప్రాంతంలో మరో 47 కిలో మీటర్ల దూరం (గతంలో 101కి.మీలు) తగ్గుతుండటంతో 741 హెక్టార్ల భూమిని సేకరించే ప్రతిపాదనలను వెనక్కి తీసుకోనున్నారు. దీంతో రూ.3,500 కోట్ల ఖర్చు తగ్గింది. ఈ ఎక్స్ప్రెస్ వేలో భాగంగా రూ.867 కోట్లతో చిలకలూరిపేట బైపాస్ నిర్మాణం ప్రారంభమైంది.
అనంతపురం జిల్లా నుండి వైఎస్సార్ కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల మీదుగా ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం చేపట్టనున్నారు. ఇక ఈ ఎక్స్ప్రెస్ వే కి రూ.27,635 కోట్లు ఖర్చు అవుతుందని టీడీపీ ప్రభుత్వంలో అంచనా వేయగా..తాజా మార్పులతో రూ.3,500 కోట్లు ఆదా అవ్వనుంది. ఈ ఎక్స్ప్రెస్వే వల్ల 148 కిలో మీటర్ల ప్రయాణ దూరం తగ్గడంతో పాటు రెండు గంటల ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది.