సినీ నిర్మాతలూ మీకు భలే క్లూ ఇచ్చారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు…! ఆయన మాట వింటే, ఈ క్లూ పాటిస్తే మీ సినిమా ఎలా ఉన్నా డబ్బులొచ్చేస్తాయన్నమాట. అదేమిటంటే. “మీరు ఏదైనా సినిమా రిలీజ్ చేయాలనుకునే ముందు ఒక ప్రభుత్వ పథకం అమలు చేశారో లేదో చూసుకోండి. ఆ పథకం డబ్బులు లబ్ధిదారులకు చేరితే మీ సినిమాకు ఫుల్లుగా డబ్బులు వచేసినట్టే. అది ఎలా ఉన్నా, మీరు ఊహించినడానికంటే బోలెడు డబ్బులు వచేస్తాయన్నమాట”…! నమ్మరా…! అయితే రాధాకృష్ణ గారి “కొత్తపలుకులు” చూడండి, వినండి, తరించండి.
వ్యాపారులూ మీరూ బాధ పడకండి. మీకూ మరో క్లూ సెలవిచ్చారాయన. అదేమిటంటే…! “మీరు సంవత్సరం పొడవునా డిస్కౌంట్లు ఇచ్చి విసిగిపోయి ఉంటారు. అందుకే ప్రభుత్వం ఏదైనా పథకం ద్వారా లబ్ధిదారులకు డబ్బులు ఇచ్చే ముందు మీరు డిస్కౌంట్లు తీసోయొచ్చట. మీకు డబ్బులే డబ్బులట”…! ఇదీ ఆ కొత్తపలుకులోనే సెలవిచ్చారు. ఉదాహరణ కూడా చూపించేశారు. అమ్మఒడి పథకం డబ్బులు ఆ తల్లులు సంక్రాంతిలో సినిమాలు చూడడానికి ఖర్చు చేసేసారట. అందుకే సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురం సినిమాలకు ఊహించినదానికంటే ఎక్కువ డబ్బులు వచ్చాయట. వస్త్ర వ్యాపారులు డిస్కౌంట్లు ఎత్తేసి, అమ్మేసి బాగా సంపాదించేసారట. అలా రాధాకృష్ణ గారు అమ్మఒడి పథకానికి… అల వైకుంఠపురానికి లింకెట్టారు.
పత్రికల్లో రాతలు రోత పుట్టిస్తే మీడియా విలువలు దిగజారక ఇంకేమవుతుంది..? సర్క్యులేషన్ పడిపోక ఇంకేమవుతుంది..? నాలుగో ఎస్టేట్ అనుకునే మీడియా విలువలు ఇప్పుడు బజారులో అమ్మకానికి ఉన్నాయి. ప్రభుత్వ విధానాలకు, సీఎం జగన్ కు ఆంధ్రజ్యోతి పక్కా విరుద్ధం. రాధాకృష్ణ అంటే చంద్రబాబు మనిషి. ఓకే..! అందరికీ తెలిసిందే. జర్నలిస్టుగా, మీడియా అధిపతిగా పద్ధతి ప్రకారం, హుందాగా ప్రభుత్వ విధానాలను, సీఎం జగన్ ను ఎండగడితే బాగానే ఉంటుంది. కానీ రాధాకృష్ణ విలువలు దిగజార్చి మరీ అదే పనిలో పడ్డారు.
“అమ్మఒడి డబ్బులు వల్లనే ఆ సంక్రాంతి సినిమాలు బాగా ఆడాయి, డబ్బులు వచ్చాయి అనడం ముమ్మాటికీ రాధాకృష్ణ తప్పటడుగే. ఇక్కడో చిన్న లెక్కలు, ఉదాహరణలు చూస్తే ఆయనగారు ఎక్కడ మిస్ అయ్యారో కళ్లెదుట కనిపిస్తుంది.
“సరిలేరు నీకెవ్వరూ సినిమా మొత్తం మీద 145 కోట్లు షేర్ వసూలు చేస్తే ఆంధ్రప్రదేశ్ లో రూ. 75 కోట్ల వరకు ఉంది. నైజాం లో రూ. 41 కోట్లు ఉంది. ఇతర రాష్ట్రాల్లో రూ. 13 కోట్లు ఉంది.
అల వైకుంఠపురంలో సినిమా మొత్తం మీద 160 కోట్లు వరకు షేర్ వసూలు చేస్తే ఆంధ్రప్రదేశ్ లో రూ. 82 కోట్లు వరకు షేర్ వచ్చింది. నైజాం లో రూ. 45 కోట్లు షేర్ వచ్చింది. ఇతర రాష్ట్రాల్లో రూ. 16 కోట్లు వరకు ఉంది.
ఈ రెండు చిత్రాలు కలెక్షన్లు అన్ని ప్రాంతాల్లోనూ పెరిగాయి. నైజాం లో కూడా ఏకంగా ఊహకందని కలెక్షన్లు వచ్చాయి. ఇలా అన్ని ప్రాంతాల్లోనూ 25 శాతం ఎక్కువగానే వచ్చాయి. అంటే అక్కడ కూడా “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి పని చేసిందా? ఇతర రాష్ట్రాల్లో కూడా పని చేసిందా..? ఈ రెండు సినిమాలకు అంతగా కలెక్టన్లు రావడానికి కారణం టికెట్ ధరలు పెంచడం. సంక్రాంతికి మూడో సినిమా పోటీ లేకపోవడం. ఇద్దరూ ప్రమోషన్లు బాగా చేయడం. నిజంగా రాధాకృష్ణ చెప్పినట్టు అమ్మఒడి డబ్బులే పని చేస్తే నైజాం, ఇతర రాష్ట్రాల్లో సాధారణ కలెక్షన్లు ఉండాలి. ఇటువంటి లెక్కలు లేకుండా…, అడ్డగోలుగా లింకులు పెట్టేసి పథకాలని, ఉద్దేశాన్ని విమర్శిస్తే జర్నలిజం ఎటో వెళ్తుంది. పాపం రాధాకృష్ణ ఏదో చెప్పబోయి, ఇంకేదో చేయబోయి బొక్కబోర్లా పడుతున్నారు.
శ్రీనివాస్ మానెం