కర్నూలు: ఏపీలో ఎన్ఆర్సీపై డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజులుగా ఎన్ఆర్సీ గురించి ముస్లిం వర్గాల్లో ఆందోళన నెలకొందని ఆయన అన్నారు. ప్రజల ఆందోళనలను గమనిస్తున్నామన్న ఆయన.. ముస్లింలకు వైసీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లిం, మైనార్టీలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందించారని గుర్తు చేశారు. సీఎం జగన్ మైనార్టీలకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముస్లింను డిప్యూటీ సీఎం చేశారన్నారు. గత ఎన్నికల్లో అయిదుగురు ముస్లింలకు టికెట్ ఇచ్చారని, హిందూపురంలో ఇక్బాల్ ఒడినా.. ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని గుర్తు చేశారు.
బడ్జెట్ సమావేశాల్లో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని డిప్యూటీ సీఎం చెప్పారు. హమారా సమావేశాల్లో మైనార్టీలపై దేశ ద్రోహం కేసు పెడితే సీఎం జగన్ వాటిని ఎత్తివేశారని తెలిపారు. హజ్ యాత్రకు వెళ్లే హాజీలకు రూ.60 వేల రూపాయలు అందించేందుకు చర్యలు చేపట్టారని అంజాద్ బాషా తెలిపారు. ఇమామ్, మౌజమ్లకు మార్చి 1 నుంచి రూ. 15 వేల గౌరవ వేతనం ఇ్వబోతున్నామని వెల్లడించారు. వక్ఫ్ భూములు కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఎన్ఆర్సీపై ఆందోళనను సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ ముస్లింలకు అండగా ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఏ అన్యాయం జరిగినా తాము వ్యతిరేకిస్తామని, పోరాటంలో ముందుంటామని స్పష్టం చేశారు. దీనిపై రాజ్యసభ, లోక్సభలోనూ పోరాడుతామని అంజాద్ బాషా చెప్పారు.