(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కోస్తాతీరం, రాయలసీమ జిల్లాల్లో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురస్తున్నాయి. అటు అరేబియా మహా సముద్రంలో కోమరీన్ ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా బుధవారం లక్షదీపుల ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం వాయిగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలోనూ అల్పపీడనం ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బుధవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపిలో తీరం వెంబడి ఉండే గ్రామాల, పట్టణాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కర్నాటక, కేరళ, లక్ష ద్వీప్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
కేరళ, మాల్దీవులు ప్రాంతాల్లోని అరేబియా సముద్ర తీర ప్రాంతాల్లో గంటకు 60 నుండి 70 కిలో మీటర్ల వేగంత గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈశాన్య రుతుపవనాలకు తోడు అల్పపీడనం ఏర్పడటంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.