అమరావతి: ఏపీకి మూడు రాజధానుల బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని దేశ వ్యాప్తంగా మెజార్టీ ప్రజలు తప్పుపడుతున్నారు. ఏపీకి మూడు రాజధానుల అంశానికి సంబంధించి జాతీయ మీడియా అయిన ఇండియా టీవీ ఒపీనియన్ పోల్ ను ట్విట్టర్ వేదికగా నిర్వహించింది. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ, శాసనపరమైన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటు చేయబోన్నారని… రాజధానులను విభజించడం సరైన ఆలోచనేనా? అంటూ పోల్ నిర్వహించింది. ఈ పోల్ లో 67 శాతం మంది ప్రజలు మూడు రాజధానుల ఆలోచన సరైనది కాదంటూ జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. 29 శాతం మంది సరైన నిర్ణయమేనని అభిప్రాయపడ్డారు. నాలుగు శాతం మంది ఏమీ చెప్పలేమని అన్నారు. ఈ పోల్ సర్వేను ఇండియా టీవీ దాదాపు 5 గంటల సేపు నిర్వహించింది. దాదాపు ఎనిమిది వేల మంది ఈ పోల్ లో పాల్గొన్నారు.
Andhra Pradesh to have 3 capitals: 70 per cent people in India TV poll think it is not a good idea | via @IndiaTVNews#AndhraPradesh https://t.co/7D9d1gM2Fe
— India TV (@indiatvnews) January 21, 2020
ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం తప్పని టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్వీట్ చేశారు. ఇండియా టీవీ నిర్వహించిన సర్వేలోనూ అదే తేలిందని చెప్పారు. 67 శాతం మంది వ్యతిరేకించినా మూడు రాజధానులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణమని ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు.
జగన్మోహన్ రెడ్డి @ysjagan & గ్యాంగ్ @YSRCParty తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం తప్పు అని @indiatvnews సర్వే లో తేల్చి చెప్పిన 67 శాతం మంది . pic.twitter.com/LqLAVO8PWF
— Kesineni Nani (@kesineni_nani) January 21, 2020
ఏపీకి మూడు రాజధానుల బిల్లుకు రాష్ట్ర శాసనసభ సోమవారం ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలంటే మూడు రాజధానుల అవసరమని ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో చెప్పారు. లెజిస్లేటివ్ రాజధానిగా అమరావతి, జ్యుడిషియల్ రాజధానిగా కర్నూలును, పరిపాలనా రాజధానిగా విశాఖని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శాసనసభలో బిల్లును ఆమోదించింది. అయితే, ఏపీలో మూడు రాజధానుల నిర్ణయాన్ని మెజార్టీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ రాజధాని రైతులు చేస్తున్న ఉద్యమాన్ని, ప్రతిపక్ష టీడీపీ చేసిన ఆందోళనలను ప్రభుత్వం లెక్కచేయలేదు. తాను అనుకున్న విధంగానే రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.