చైనా: ఏపీకి చెందిన ఓ యువతి తాను వూహాన్లో చిక్కుకుపోయానంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఓ వీడియో కలకలం రేపుతోంది. ఉద్యోగంలో భాగంగా ఇచ్చే శిక్షణ కోసం చైనా వెళ్లిన కర్నూల్ జిల్లాకు చెందిన యువతి అక్కడ చిక్కుకుపోయింది. కర్నూలు జిల్లా ఈర్లపాడుకు చెందిన బాధిత యువతి శృతి టీసీఎల్ ఉద్యోగ శిక్షణ కోసం చైనాలోని వూహాన్కు వెళ్లింది. ప్రస్తుతం ఆ దేశంలో కరోనా వైరస్ తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో భారత్ కు తిరిగి రావాలన్న ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. ఆమె జ్వరంతో బాధపడుతుండడంతో భారతీయులను తెచ్చేందుకు పంపిన ప్రత్యేక విమానంలోకి విమాన సిబ్బంది ఆమెను అనుమతించలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్న ఈ యువతి తన ఆవేదన తెలియజేస్తూ తల్లికి వీడియో పంపింది.
బాధితురాలు తన గోడును వీడియో ద్వారా కుటుంబ సభ్యులకు చెప్పుకుని కన్నీరుమున్నీరవుతోంది. తనకు జ్వరం ఉన్న మాట వాస్తవమేనని.. అయితే ఇప్పుడు తన ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొంది. పనులు చేయడం వల్లే అలసటతో జ్వరం వచ్చిందని… అంతే తప్పా తనకు ఎలాంటి కరోనా వైరస్ లక్షణాలు లేవని తెలిపింది. దీంతో శృతి తల్లి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డను ఇంటికి రప్పించాలని ఆమె ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువుర్ని చైనా నుంచి స్వగ్రామానికి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే.
మూడు నెలల శిక్షణ కోసం సహచరులు 58 మందితో కలిసి శృతి చైనా వెళ్లింది. ప్రస్తుతం ఆమె జ్వరంతో బాధపడుతుండడంతో అక్కడి అధికారులు ఇండియాకు పంపేందుకు ఒప్పుకోవడం లేదు. ఇటీవలే శృతికి నిశ్చితార్థం జరిగింది. ఆమె వివాహం ఈ నెల 17న జరగాల్సి ఉంది. శిక్షణ కోసం వుహాస్కు వెళ్లిన 58 మందిలో ఇద్దరు మాత్రమే అక్కడ నిలిచిపోయారు. ఆమెను వూహాన్ నుంచి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మరోవైపు చైనాలోని వూహాన్ను కరోనా వైరస్ వణికిస్తుంది. ఈ వైరస్ బారిన బడి వందలాదిమంది చనిపోయారు. ఇటు భారతదేశంలో కూడా ఇప్పటికే కరోనా వైరస్కు సంబంధించి రెండు కేసులు నమోదయ్యాయి. టీసీఎల్ ఉద్యోగ శిక్షణ కోసం చైనాకు వెళ్లి అక్కడ చాలామంది చిక్కుకుపోయారు. అందులో తెలుగు వారు కూడా ఉన్నారు. దీంతో దేశ ప్రభుత్వం వూహాన్లో చిక్కుకున్న భారతీయుల్ని రప్పించేందుకు రెండు ప్రత్యేక విమానాల్ని పంపింది. అంతేకాదు వారి కోసం సరిహద్దుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి అందులో ఉంచింది. వారికి పరీక్షలు చేసి కరోనా వైరస్ ఉందా? లేదా? అన్న పరీక్షలు నిర్వహిస్తున్నారు.