(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ముంబయి తరహా ఉగ్రదాడులు మరోసారి జరిగితే పాక్పై సైనిక చర్య తీసుకోవాలని భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనుకున్నారని బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కెమరూన్ అన్నారు. ఈ విషయాన్ని మన్మోహన్ సింగ్ తనతో చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆత్మకథలో వెల్లడించారు. డేవిడ్ కెమరూన్ జీవితం ఆధారంగా రచించిన ‘ఫర్ ద రికార్డ్’ పుస్తకం గురువారం విడుదలైంది. ఆ పుస్తకంలో తన భారత పర్యటనకు సంబంధించి అనేక విషయాలను కెమరూన్ ప్రస్తావించారు. మాజీ ప్రధాని మన్మోహన్ తోపాటు ప్రస్తుత ప్రధాని మోదీతో తనకున్న అనుబంధాన్ని తలచుకొంటూ జ్ఞాపకాలను ప్రత్యేకంగా పంచుకున్నారు.
‘ప్రధాని మన్మోహన్ సింగ్తో నాకు సత్సంబంధాలున్నాయి. ఆయన రుషిలాంటి మనిషి. అయితే భారత్ ఎదుర్కొన్న ఉగ్రదాడుల ముప్పు విషయంలో మాత్రం ఆయన కఠినంగానే ఉన్నారు. 2011 జులై 13న ముంబయిలో జరిగిన ఉగ్రదాడులు లాంటి దాడి మరోసారి జరిగితే పాక్పై భారత్ సైనిక చర్య తీసుకోవలసి ఉంటుందని భారత్ పర్యటన సందర్భంగా మనోహన్ను కలిసినప్పుడు ఆయన నాతో అన్నారు’ అని కామెరాన్ తన పుస్తకంలో పేర్కొన్నారు.
అయితే పాక్పై భారత్ సైనికచర్య ఎందుకు తీసుకోలేదన్నది కామెరూన్ వివరించలేదు. తన పర్యటనలో రక్షణ ఒప్పందాల సహా బ్రిటన్ – భారత్ దేశాల మధ్య ద్వైపాక్షిక, ప్రపంచ అంశాలపై వారిద్దరు విపులంగా చర్చించిన విశేషాలను పుస్తకంలో ప్రస్తావించారు. 2010–2016 వరకు కామెరాన్ బ్రిటన్ ప్రధానిగా పనిచేశారు. ప్రధానిగా ఉన్న కాలంలో ఆయన మూడు సార్లు భారత్ సందర్శించారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడంపై నిర్వహించిన రెఫరెండం నేపథ్యంలో 2016లో ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేశారు.
ఇక ప్రస్తుత ప్రధాని మోదీ గురించి కూడా కామెరాన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉందన్నారు. 2015లో ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ పర్యటన సందర్భంగా తాము ఒకే వేదికను పంచుకున్నామని, ఆ సందర్భంలో మోదీని తాను ఆలింగనం చేసుకున్నానని తెలిపారు. దాదాపు 60 వేల మంది ఎన్నారైలతో కిటకిటలాడిపోతోన్న వెంబ్లే స్టేడియానికి భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి వెళ్లానని తెలిపారు. తాము ఇద్దరం ప్రధాన వేదికపైకి చేరుకోగానే నినాదాలు మిన్నంటాయని పేర్కొన్నారు. వెంబ్లే స్టేడియంలో మోదీ సభ ఓ చారిత్రక ఘట్టమని, బ్రిటన్.. భారత్ కు ఎల్లవేళలా అండగా ఉంటుందని కామెరూన్ అన్నారు.