(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
ప్రాణాంతక కరోనా వైరస్ కేసు మరొకటి భారత్లో వెలుగులోకి వచ్చింది. తాజాగా మూడో వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధరించారు. కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ కూడా దీన్ని ధ్రువీకరించింది. కేరళలోని కాసర్గఢ్లో ఓ వ్యక్తి కరోనా వైరస్ బారిన పడినట్లు గుర్తించారు. బాధితుడు ఇటీవల వుహాన్ నుంచి కేరళ చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
గత గురువారం కేరళలోనే తొలి కరోనా కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇక ఆదివారం అలప్పుజలో రెండో వ్యక్తి కూడా వైరస్ బారిన పడ్డట్లు గుర్తించారు. వైరస్ సోకిన ముగ్గురు ఇటీవల వుహాన్ నుంచి చేరకున్నారు. వీరంతా అక్కడ చదువుకుంటున్న వైద్య విద్యార్థులే.
ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామనీ ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కె.కె.శైలజ తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు సహా మిగతా ప్రభుత్వాలూ అప్రమత్తమయ్యాయి. ఆయా రాష్ట్రాల్లోని విమానాశ్రయాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానితులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు.
ఇప్పటి వరకు భారత్లో దాదాపు 198 మంది అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం సైతం వైరస్ వ్యాప్తి చెందకుండా అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది. చైనా ప్రయాణంపై ఆంక్షలు విధించింది. ఇతర దేశాల పర్యాటకులకు ఇ-వీసా సదుపాయాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు.