అమరావతి: రైతులకు రుణమాఫీ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చేందుకు వైసిపి ప్రభుత్వం నిరాకరించింది. శాసనసభలో శుక్రవారం టిడిపి సభ్యుల ప్రశ్నకు బదులుగా వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ, టిడిపి హామీలకు తమ ప్రభుత్వం ఎందుకు పూచీ పడాలని అన్నారు.
నోటిఫికేషన్కు ఒక్క రోజు ముందు నాలుగు, ఐదు విడదల రుణ మాఫీకి సంబంధించిన జివోను విడుదల చేసిందని కన్నబాబు అన్నారు. రుణ మాఫీని మధ్యలోనే వదిలివేసి అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకువచ్చారని కన్నబాబు ఆరోపించారు. ఎన్నికల్లో లబ్దిపొందేందుకు కోట్లాది రూపాయల నిధులను పసుపు కుంకుమ పథకానికి మళ్లించారని ఆయన దుయ్యబట్టారు. అయినప్పటికీ నాలుగు, ఐదు విడదల రుణ మాఫీకి సంబంధించిన సమస్యను తమ ప్రభుత్వం పరిశీలన చేస్తుందనీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని కన్నబాబు పేర్కొన్నారు.
ఈ అంశంపై ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ రానందుకు టిడిపి సభ్యులు వాకౌట్ చేశారు. తర్వాత టిడిపి ఎమ్మెల్యేలు నిమ్మకాయల చిన రాజప్ప, ఏలూరు సాంబశివరావులు మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, 33లక్షల రైతు కుటుంబాలకు సంబంధించిన రుణ మాఫీ సమస్యపై అసెంబ్లీలో ప్రస్తావిస్తే మంత్రి సమాధానం దాటవేశారని వారు అన్నారు.
రాష్ట్రంలో 33లక్షల మంది రైతులకు రుణ మాఫీ నాలుగు, ఐదు విడతల కింద చెల్లించాల్సిన ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రస్తుత ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రుణ మాఫీ నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారని అన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో 24వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేయాల్సి ఉండగా మూడు విడతలుగా 16వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. రైతుల కష్టాలను తీర్చేందుకు రుణ మాఫీ అమలు చేయాలని వారు అన్నారు. తమ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకాన్నీఈ ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు. ఈ ప్రభుత్వం రుణ మాఫీ విషయంలో రెండు నాలుకల ధోరణిలో ఉందని వారు విమర్శించారు.