(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో నాల్గవ రోజైన గురువారం ఏడి ఎడ్యుకేషన్ యాక్ట్ సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదించింది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెడుతూ గత సమావేశాల్లో బిల్లును ఆమోదించి మండలికి పంపగా మండలిలో టిడిపి అడ్డుకున్నది. సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లును శాసనసభకు తిప్పి పంపింది. అయితే మండలి చేసిన సవరణలను శాసనసభ తిరస్కరించింది. ఈ బిల్లుపై ముఖ్యమంత్రి, మంత్రులు, వైసిపి ఎమ్మెల్యేలు ప్రసంగించారు. ఈ బిల్లుకు మండలిలో సవరణలను ప్రతిపాదించడాన్ని అధికార పక్ష సభ్యులు తప్పుబట్టారు.
సిఎం జగన్ మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం రైట్ టు ఇంగ్లీషు విధానం తీసుకువచ్చామన్నారు. ఇంగ్లీషు మీడియం బిల్లును శాసనమండలిలో అడ్డుకుని సవరణలు చేస్తూ అసెంబ్లీకి తిప్పి పంపారని విమర్శించారు. మండలిలో బిల్లు అడ్డుకున్నా చట్టంగా మారుతుందని అన్నారు. అన్ని తెలిసి కూడా ఎందుకు అడ్డుకున్నారో తెలియడం లేదని పేర్కొన్నారు. వచ్చే జూన్ ఒకటికి విద్యార్థులకు విద్యాకానుక అందిస్తామని జగన్ అన్నారు.