అమరావతి: ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రూపొందించిన బిల్లుకు ఏపీ అసెంబ్లీ సోమవారం ఆమోదం తెలిపింది. ఆర్టీసీ విలీనం తాలూకు బిల్లును మంత్రి పేర్ని నాని శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం, ఈ బిల్లును సభ ఆమోదించినట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.
అంతకుముందు, ఆర్టీసీ విలీనంపై అసెంబ్లీలో మాట్లాడిన సీఎం జగన్.. ఆర్టీసీలో పనిచేస్తున్న 52వేల మంది ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నామని ప్రకటించారు. జనవరి 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగనున్నట్టు వెల్లడించారు. ఇకపై 52 వేల మంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులే అని చెప్పారు. చంద్రబాబు హయాంలో ఆర్టీసీ గురించి ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. ప్రైవేట్ రంగ సంస్థల్లోని ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం కాకుండా గతంలో చంద్రబాబు చట్టం తెచ్చారని తెలిపారు. 1997లో తీసుకొచ్చిన ఈ చట్టం.. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకోవడానికి ఇబ్బందిగా మారిందని… అందుకే కొత్తగా దీని కోసం చట్టం చేస్తున్నామని సీఎం చెప్పారు.
మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. పాదయాత్రలో ఆర్టీసీ కార్మికుల కష్టాలను సీఎం జగన్ ప్రత్యక్షంగా చూశారని, ఇకపై ప్రజారవాణా శాఖలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తామని తెలిపారు. కార్మికుల ఉద్యోగ భద్రత కోసమే ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామని చెప్పారు. పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్ ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన 200 రోజుల్లోనే నిలబెట్టుకున్నారని తెలిపారు. ఇందుకోసం సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఓ కమిటీ వేశారని… ప్రజరవాణా శాఖను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ప్రజారవాణా శాఖలోకి ఉద్యోగులను తీసుకుని వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు ముందుకొచ్చామని అన్నారు. ఆర్టీసీని ఆదుకోవడానికి సీఎం జగన్ బడ్జెట్లో రూ. 1500 కోట్ల కేటాయించారని పేర్ని నాని తెలిపారు. 52 వేల ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకోవడం వల్ల రూ. 3000 వేల కోట్లకు పైగా ఆర్థిక భారం ప్రభుత్వంపై పడుతుందని మంత్రి వివరించారు. ఈ భారం మోసేందుకు ప్రభుత్వం సిద్ధపడిందని చెప్పారు.
కాగా, తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికల వేళ జగన్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక విలీనం దిశగా అడుగులేశారు. అయితే, ఆర్టీసీలో కేంద్రానికి 33 శాతం వాటా ఉండటంతో.. సంస్థను విలీనం చేయడం కుదరలేదు. దీంతో ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకోవాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇటీవలే నివేదికను సమర్పించగా.. దానికి అనుగుణంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ చట్టం చేసింది. దీంతో ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ అనుబంధ సంస్థగా ఉన్న ఏపీఎస్ఆర్టీసీ.. ఇక నుంచి పూర్తిస్థాయి ప్రభుత్వ సంస్థగా మారనుంది. జగన్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో 52 వేల మంది ఆర్టీసీ కార్మికులు ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారతారు. ఇప్పటికే జగన్ సర్కారు ఆర్టీసీ ఉద్యోగులు రిటైర్మెంట్ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచింది. ఆర్టీసీ కోసం ప్రజారవాణా శాఖను కూడా తీసుకొచ్చేందుకు ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.