(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ఏపి అసెంబ్లీలో మాటల యుద్ధం కొనసాగుతోంది. మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా టిడిపి సభ్యులు ‘జై అమరావతి, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాలి’ అంటూ నినాదాలు చేశారు. టిడిపి ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. టిడిపి సభ్యులు ఆందోళన చేస్తుండగానే మంత్రులు తమ ప్రసంగాలను కొనసాగించారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ అమ్మఒడి, రైతు భరోసా లాంటి కీలక అంశాలపై సభలో చర్చ జరుగుతున్నప్పుడు టిడిపి సభ్యులు గందరగోళం చేయడం తగదన్నారు. విశాఖకు రాజధాని వస్తుంటే ఉత్తరాంధ్ర టిడిపి ఎమ్మెల్యేలు అడ్డుకోవడం దారుణమని విమర్శించారు.
టిడిపి సభ్యుల ఆందోళనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి సభ్యులు మొత్తం కలిపి పది మంది కూడా లేరనీ, ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్నారనీ మండిపడ్డారు. స్పీకర్ను అగౌరవపరుస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారనీ, దీంతో వైసిపి సభ్యులు రెచ్చిపోయి దాడి చేస్తే ఆ ఘటనను రాజకీయం చేసి లబ్దిపొందాలని చూస్తున్న దిక్కుమాలిన పార్టీ టిడిపి అని జగన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. సంస్కారం లేని ఇలాంటి వ్యక్తులు సభకు ఎందుకు వస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. సభ్యులు స్పీకర్ పోడియం రింగ్ దాటి వస్తే మర్షల్స్ ఎత్తుకెళ్లే పరిస్థితి తీసుకురావాలని సభాపతికి సూచించారు. టిడిపి సభ్యులకంటే వీధి రౌడీలు చాలా బెటర్ అంటూ జగన్ వ్యాఖ్యానించారు.
టిడిపి సభ్యులను బయటకు తీసుకువెళ్లేందుకు మార్షల్స్ రావడంతో సస్పెండ్ చేయకుండా బయటకు ఎలా తీసుకువెళ్తారంటూ టిడిపి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ అసెంబ్లీ నుండి టిడిపి సభ్యులు వాకౌట్ చేశారు. స్పీకర్ బదులు సిఎం జగన్ రూలింగ్ ఇస్తున్నారని టిడిపి ఎమ్మెల్యేలు చిన రాజప్ప, జోగేశ్వరరావు మండిపడ్డారు.సభ నుండి సస్పెండ్ చేయకుండానే తమ మెడ మీద చేయి వేసి మార్షల్స్ నెట్టివేశారని వాపోయారు.
టిడిపి సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సభ్యుడు సభానియమావళికి కట్టుబడి ఉండాలన్నారు. గత మూడు రోజులుగా సభ్యులు నియమాలు ఉల్లంఘిస్తునే ఉన్నారనీ, ఇది ఆక్షేపణీయం అన్నారు. మాట్లాడేందుకు అవకాశం ఇస్తాను, వెళ్లి కూర్చోవాలని చెప్పినా వినడం లేదని తమ్మినేని పేర్కొన్నారు. టిడిపి సభ్యులు ముందస్తు ఆలోచనతో వచ్చారనీ, సస్పెండ్ చేస్తే సభ నుండి వెళ్లిపోతామంటున్నారనీ స్పీకర్ పేర్కొన్నారు. బలహీన వర్గాలకు చెందిన వ్యక్తినే గానీ బలహీనుడు మాత్రం కాననీ పేర్కొంటూ సభ్యుల ప్రవర్తనపై ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేస్తున్నట్లు స్వీకర్ తెలిపారు. సత్వర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని స్పీకర్ ఆదేశించారు.