(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉభయసభలను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నేడు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉభయసభలను ప్రోరోగ్ చేసిన నేపథ్యంలో వికేంద్రీకరణ బిల్లు, సి ఆర్ డి ఏ రద్దు బిల్లులపై ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. బిల్లులు శాసనమండలి ముందు ఉన్నప్పటికీ సభలను ప్రోరోగ్ చేస్తే ఆర్డినెన్స్ జారీకి సాంకేతిక ఇబ్బందులు ఉండవని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. వికేంద్రీకరణ బిల్లు, సి ఆర్ డి ఏ రద్దు బిల్లులను అసెంబ్లీ ఆమోదించి శాసనమండలికి పంపగా ఆ బిల్లులను మండలి ఆమోదించలేదు, తిరస్కరించలేదు. చైర్మన్ షరీఫ్ తన విచక్షణాధికారాలతో సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేసిన విషయం తెలిసిందే. దీంతో మండలి తీరుపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ శాసనమండలిని రద్దు చేసింది. ఆ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. నిన్న ప్రధాని మోదీతో భేటీ సమయంలో ఈ విషయాలను సీఎం జగన్ వివరించి మండలి రద్దు బిల్లును ఆమోదించాలని కోరినట్లు సమాచారం. ఇదిలా ఉండగా సి ఆర్ డి ఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులను మండలి ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపించారు. సెలెక్ట్ కమిటీకి పేర్లు తీసుకోవాలని మండలి కార్యదర్శికి ఛైర్మన్ ఆదేశించగా, కార్యదర్శి మాత్రం ఆ ఫైల్ను వెనక్కి పంపించారు. దీనిపై మండలి ఛైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ 48 గంటల్లో సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాల్సిందేనని నిన్న రాత్రి మరోమారు మండలి కార్యదర్శిని ఆదేశించారు. ఈ వివాదం నడుస్తున్న నేపథ్యంలోనే ఉభయసభలను ప్రోరోగ్ చేయడంతో ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ ఆర్డినెన్స్ తీసుకొస్తే వికేంద్రీకరణ బిల్లు, సి ఆర్ డి ఏ రద్దు బిల్లులు పరిగణనలోకి వచ్చినట్లేనని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆర్డినెన్స్ ద్వారా ఈ రెండు బిల్లులు ఆమోదిస్తే కార్యాలయాలు తరలించాలని భావిస్తోంది. మరోవైపు ఈ బిల్లులపై హైకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉంది. ఈ నెల 25న ఈ బిల్లులపై హైకోర్టులో విచారణ జరుగనున్నది.