అమరావతి: ఏపి అసెంబ్లీ శీతకాల సమావేశాల ప్రారంభం రోజే వాడివేడిగా మొదలయ్యాయి. సభలో మొదటి రోజు పిపిఏలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. విద్యుత్ రంగంలో గోపాలరెడ్డి కమిటీ ఇచ్చిన నివేదికపై ఏమి చర్యలు తీసుకున్నారంటూ ప్రభుత్వాన్ని టిడిపి సభ్యుడు నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో పిపిఏల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని నిమ్మల అన్నారు. దీనికి ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి సమాధానమిచ్చారు. పిపిఏలపై ఉన్నత స్థాయి కమిటీ సమీక్షిస్తోందని చెప్పారు. ప్రభుత్వం పద్ధతి ప్రకారం నిజానిజాలు వెలికి తీయడానికి సమయం పడుతుందని బుగ్గన అన్నారు.
ఈ కమిటీల వల్ల ఏపీకి తీవ్ర నష్టం జరుగుతుందని టిడిపి ఉప నేత అచ్చెంనాయుడు విమర్శించారు. పిపిఏలపై వేసిన కమిటీపై అచ్చెన్నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. పిపిఏల సమీక్షతో దేశానికి నష్టమని కేంద్రం చెబుతోందన్నారు.అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై బుగ్గన స్పందిస్తూ అసలు పిపిఏలపై ఎందుకు కమిటీ వేశామో చెప్పామన్నారు. వాస్తవాలు చెబితే టిడిపి ఒప్పుకోదని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వం డిస్కంలను ముంచేసిందని బుగ్గన అన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై గత ప్రభుత్వం హడావుడి నిర్ణయాలు తీసుకున్నదని బుగ్గన అన్నారు. అక్రమాలు జరిగితే సమీక్షించుకోవచ్చని కేంద్రం రాసిన లేఖలో ఉన్నదనీ బుగ్గన వివరించారు. ప్రతీ దాన్ని రాజకీయం చేయోద్ధని బుగ్గన సూచించారు. ఆర్థిక మంత్రి బుగ్గన ఇచ్చిన సమాధానంపై టిడిపి ఎమ్మెల్యేలు సభలో ఆందోళనకు దిగారు. తమకు కూడా మరోసారి మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ నిరసనకు దిగారు. స్పీకర్ తమ్మినేని వారిని వారించారు.