అమరావతి: ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వని శాసనమండలి అనవసరని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో సహా అధికార పక్ష సభ్యులు అభిప్రాయపడ్డారు. సోమవారం సభలో శాసనమండలి కొనసాగించాలా వద్దా అన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాల్లో నాల్గవ రోజు గురువారం సాయంత్రం శాసనమండలిలో నిన్న జరిగిన తీరుపై సిఎంతో సహా అధికార పక్ష సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన పెద్దల సభ బిల్లులను చట్టం కాకుండా నిరోధించే సభగా ఉందని విమర్శించారు. హత్య చేయడం నేరం, తప్పు, అంటూనే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన విధంగా శాసనమండలి చైర్మన్ వ్యవహరించారని అన్నారు. నిబంధనల ప్రకారం సెలక్ట్ కమిటీకి పంపకూడదు అంటూనే తప్పు చేశారన్నారు. శాసనమండలిలో చైర్మన్ ప్రసంగాన్ని అసెంబ్లీలో ప్రదర్శింపజేశారు.
ఈ పరిస్థితిలో శాసనమండలి అవసరమా కాదా అన్న విషయంపై గట్టిగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని జగన్ అన్నారు. రోజుకు శాసనమండలి నిర్వహణకు కోటి రూపాయలు ఖర్చు అవుతుందనీ ఆర్థిక పరిస్థితి బాగోలేని ఈ రాష్ట్రంకు ఇంత ఖర్చు చేయాల్సిన అవసరం ఉన్నదా అని ప్రశ్నించారు. ఇంగ్లీషు మీడియం బిల్లు అడ్డుకోవడం లాంటి పరిస్థితులు కూడా జరిగాయన్నారు. ఎస్టి, ఎస్టి కమిషన్ల ఏర్పాటు బిల్లును అడ్డుకోవడం, చట్టాలు కాకుండా చేయడం లాంటి చర్యలకు పాల్పడుతున్న పెద్దల సభ అవసరమా అని జగన్ ప్రశ్నించారు. జగన్ మాట్లాడుతున్న సమయంలో అధికార పక్ష సభ్యులు అందరూ శాసనమండలి అవసరం లేదంటూ బల్లలు చరుస్తూ తమ ఆంగీకారం తెలిపారు.
ప్రభుత్వ బిల్లులను మండలిలో రాజకీయ దురుద్దేశంతో అడ్డుకుంటున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ఎజండాతో నడుస్తున్న ఈ పెద్దల సభను కొనసాగించాలా లేదా అని దానిపై సుదీర్ఘంగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం శాసనసభలో పూర్తి స్థాయిలో శాసనమండలి కొనసాగించాలా వద్దా అనే అంశంపై చర్చిద్దామని జగన్ పేర్కొన్నారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం సభను సోమవారానికి వాయిదా వేశారు.