అమరావతి: అనంతపురం జిల్లాకు కియా మోటార్స్ రావడంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనత ఏమీలేదని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్సరాల సమయంలో జరిగిన చర్చ సందర్భంగా బుగ్గన ఈ విషయాన్ని ప్రస్థావిస్తూ రాష్ట్ర ప్రజలకు అసలు విషయం తెలియాల్సి ఉందని అన్నారు. ఈ ఏడాది జూన్ 13న కియా మోటార్స్ కార్పోరేషన్ సిఇఒ ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి రాసిన లేఖను మంత్రి బుగ్గన చదివి వినిపించారు. జగన్ సిఎం అయినందుకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో తనకు ఉన్న పరిచయాన్ని లేఖలో పేర్కొన్నారని బుగ్గన అన్నారు. 2007లో ఆయన హ్యుందయ్ ఫ్యాక్టరీ చైర్మన్గా ఉన్నప్పుడు రాజశేఖరరెడ్డిని కలిశారనీ, ఆ సమయంలో రాయలసీమలో హ్యుందయ్ ఫ్యాక్టరీ పెట్టాలని వైఎస్ కోరినట్లు లేఖలో పేర్కొన్నారని బుగ్గన తెలిపారు. భవిష్యత్తులో అక్కడ ఫ్యాక్టరీ పెడతామని మాటిచ్చామనీ, ఇచ్చిన మాట ప్రకారం అనంతపురం కియా మోటార్స్ కార్పోరేషన్ ఏర్పాటు చేశామని లేఖలో ఆయన పేర్కొన్నారని బుగ్గన వివరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆనాడు ఇచ్చిన హామీ మేరకు కియా మోటార్స్ నెలకొల్పారు తప్ప ఇది చంద్రబాబు వల్లేమీ రాలేదని బుగ్గన పేర్కొన్నారు.