అమరావతి: వ్యక్తిగత దూషణలు చేశారంటూ అధికార, విపక్ష సభ్యులు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో శాసనసభలో గందరగోళ పరిస్థితి చోటుచేసుకుంది. బడ్జెట్ సమావేశాలలో ఐదవ రోజైన మంగళవారం ఆరోగ్యశ్రీపై చర్చ జరుగుతున్న సమయంలో సభా నియమాలపై ఇరుపక్షాల మధ్య వాగ్వివాదం జరిగింది. స్పీకర్ తమ్మినేని సీతారాం కల్పించుకొని సభా సంప్రదాయాలు ఎవరైనా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. వ్యక్తిగత విషయాలకు వెళ్లకూడదని స్పీకర్ సూచించారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతూ తేల్చుకుందాం రా అని అధికార పక్ష సభ్యులు అనడం, తమ వైపు సభ్యులు అడిగినప్పుడు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడం, మధ్యలో మైక్ కట్ చేసి వేరే వారికి అవకాశం ఇవ్వడం లాంటి చర్యల వల్ల సమస్య తలెత్తుతుందని అన్నారు. చంద్రబాబు సూచనల మేరకు టిడిపి ఉప నాయకుడు కింజరపు అచ్చెన్నాయుడికి స్పీకర్ అవకాశం కల్పించి సబ్జెక్ట్ త్వరగా కంప్లీట్ చేయాలని సూచించారు. దీంతో అచ్చెన్నాయుడు ‘మీరు రాసి ఇవ్వండి చదివేస్తాను’ అనడంతో స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘మేరు రాసి ఇవ్వండి నేనే చదువుతా’ అన్నారు.
అచ్చెన్నాయుడు మాట్లాడిన తీరుపై వైసిపి సభ్యుడు అంబటి రాంబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చైర్ను బెదిరించే ధోరణిలో మాట్లాడటం కాదా అని రాంబాబు ప్రశ్నించారు. ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సభ్యత కాదని రాంబాబు అన్నారు. సభ ఆర్డర్లో లేనప్పుడు ఏలా మాట్లాడాలని టిడిపి సభ్యుడు పయ్యావుల కేశవ్ అన్నారనీ, గతంలో సభ ఆర్డర్లో లేనప్పుడూ సభను నిర్వహించిన సందర్భాలు ఉన్నాయని వైసిపి సభ్యుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. ఈ విషయాన్ని నిరూపించలేకపోతే తాను రాజీమానా చేస్తానని చెవిరెడ్డి సవాల్ విసిరారు. గత అసెంబ్లీలో కారణం తెలియజేయకుండా తమ సభ్యురాలు రోజాను సస్పెండ్ చేసి మార్షల్స్తో గెంటివేసిన విషయాన్ని చెవిరెడ్డి గుర్తు చేస్తూ ఇప్పుడు వారు సభా సాంప్రదాయాలు అంటూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఐదేళ్లు అనైతికంగా సభను నడిపారని చెవిరెడ్డి విమర్శించారు.
అచ్చెన్నాయుడు మాటలను సమర్థిస్తారా అని స్పీకర్ చంద్రబాబును ప్రశ్నించగా తాను సమర్థించనని చంద్రబాబు అంటూ వైసిపి సభ్యుడు రామచంద్రారెడ్డి మాట్లాడిన దాన్ని మీరు సమర్థిస్తున్నారా అని స్పీకర్ను చంద్రబాబు ప్రశ్నించారు. సభ హుందాగా జరగాలంటే అందరూ సహకరించాలని చంద్రబాబు అన్నారు. ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరోలా న్యాయం ఉండకూడనీ, సభ సజావుగా జరగడానికి పూర్తిగా సహకరిస్తామని చంద్రబాబు అన్నారు.
వైసిపి సభ్యుడు రాంబాబు మాట్లాడుతూ తమ సభ్యుడు రామచంద్రారెడ్డి మాట్లాడిన మాటలను సమర్ధిస్తారా లేదా అని సభా నాయకుడిని ప్రశ్నించాల్సిన చంద్రబాబు స్పీకర్ను అడగడం కరెక్టు కాదని అన్నారు. గత శాసనసభ ఎలా జరిగిందో అందరికీ తెలుసునని శాససనభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంధ్రనాధ్ రెడ్డి అన్నారు. టిడిపి సభ్యులు ఇష్టారీతిలో మాట్లాడటం మంచి పద్దతి కాదనీ బుగ్గన పేర్కొన్నారు. అచ్చెన్నాయుడు సభ సంప్రదాయాలను మర్చిపోయారని మంత్రి శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.