అమరావతి: శాసనసభ గౌరవం కాపాడే విధంగా తన విధులను సక్రమంగా నిర్వహిస్తానని నవ్యాంధ్రప్రదేశ్ శాసనసభ రెండవ శాసనసభాపతిగా నియమితులవుతున్న సీనియర్ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. నేడు ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ్మినేని మాట్లాడుతూ గత ప్రభుత్వం స్పీకర్ వ్యవస్థను బ్రష్టుపట్టించిందని ఆరోపించారు.
తొలి నుండి పార్టీ నాయకుడు ఏది ఆదేశిస్తే అది చేయడం, నాయకత్వానికి విధేయుడుగా ఉండటం తనకు అలవాటని తమ్మినేని పేర్కొన్నారు. అదే విధంగా నేడు తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు పిలిపించి బరువైన బాధ్యతను అప్పగిస్తున్నాను, మీ అనుభవాన్ని జోడించి శాసనసభను నడిపించాలని చెప్పగా, తాను అంగీకరిస్తూ అపారమైన నమ్మకంతో ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేశానని తమ్మినేని చెప్పారు.
శాసనభ విశ్వాసాన్ని నిలబెట్టేందుకు తన వంతు కృషి చేస్తానని తమ్మినేని పేర్కొన్నారు. ‘గత అసెంబ్లీ వ్యవహారాలకు భిన్నంగా ఈ అసెంబ్లీ ఉంటుంది. ఇక ఎవరైనా ప్లోర్ క్రాస్ చేయమనండి చూపిస్తా నేను అంటే ఏమిటో’ అని తమ్మినేని అన్నారు. ఇటువంటి వాటిని మా నాయకుడే పోత్సహించడని తమ్మినేని చెప్పారు. ‘రాజకీయాల్లో నైతిక విలువలు (మోరల్స్) తప్పుతున్నాయి, ఆ జాడ్యం శాసనసభకు అంటుకుంది’ అని తమ్మినేని అన్నారు.
సభ్యుల ప్రజాస్వామ్య హక్కును కాపాడేవిధంగా పని చేస్తానని తమ్మినేని పేర్కొన్నారు.
శాసనసభా వ్యవహారాలు, తదితర అంశాలపై కొత్త సభ్యులకు శిక్షణా తరగతుల నిర్వహిస్తామని తమ్మినేని తెలిపారు.
సభాసాంప్రదాయాలు, నియమావళి అనుగుణంగా, వివక్షత, రాగద్వేషాలకు అతీతంగా సభను హుందాగా నడుపుతానని తమ్మినేని స్పష్టం చేశారు.