(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన సభ ప్రత్యేక సమావేశం ఈ నెల 20న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. అదే విధంగా శాసన మండలి 21 వ తేదీ సమావేశం కానుంది. 20వ తేదీ నుండి మూడు రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం అసెంబ్లీ అధికారులకు పంపించింది.
మూడు రాజధానుల ప్రకటన నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది.ఈ ప్రత్యేక సమావేశాల్లో రాజధాని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సంబంధించి జీఎన్ రావు కమిటీ, బిసిజి నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. ఈ రెండు కమిటీలను అధ్యయనం చేసేందుకు ఇప్పటికే ఏర్పాటైన హైపవర్ కమిటీ నివేదికను కూడా సమావేశాల్లో ప్రవేశ పెడతారు. ఈ సందర్భంగా రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై సమగ్ర చర్చ జరుగుతుంది.
అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజున మూడు రాజధానులు రావచ్చంటూ సిఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. రాజధాని అమరావతి ప్రాంతంలో దీనిపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. రాజధాని అమరావతిలోనే కొనసాగించాలంటూ 27 రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు జరుగనుండటంతో ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుందని అందరూ ఎదురుచూస్తున్నారు.