(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీరుపై బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాజధాని తరలింపు విశాఖపై ప్రేమతో కాదనీ, భూదందా కోసమే జగన్ ఆత్రమనీ కన్నా విమర్శించారు. జిఎన్ రావు నివేదిక పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించారనీ, దాన్ని నిరసిస్తూ జగన్కు లేఖ రాస్తాననీ కన్నా అన్నారు.
అధికారంలోకి వస్తే అమరావతిలోనే రాజధాని అభివృద్ధి చేస్తానని జగన్ చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. జగన్ మాటలకు చేతలకు సంబందం ఉండటం లేదని అన్నారు.
ఇగోయిజం, శాడియిజంతో ప్రజల ముందు జగన్ దోషిగా నిలబడ్డారని కన్నా పేర్కొన్నారు. జగన్ రాజధానిపై వేసిన కమిటీలకు చట్టబద్దత లేదని అన్నారు. జగన్కు వ్యతిరేకంగా కమిటీలు నివేదికలు ఇస్తాయని అనుకోలేదనీ, ఇప్పుడు వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తున్నాయనీ కన్నా పేర్కొన్నారు.
అమరావతిలో నిర్మాణాలు పునాది దశను ఎప్పుడో దాటి పోయాయని చెప్పారు. నేలలో గట్టితనం లేదని వైసిపి నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్ చెప్పేవి అన్నీ అబద్దాలేననీ, దోపిడీ కోసమే రాజధాని తరలింపు అనేది నిజమని ఆయన విమర్శించారు. అమరావతి పరిరక్షణకై బిజెపి- జనసేన ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని కన్నా తెలిపారు.